- దేశంలో 10 రోజులకు సరిపడా ‘వ్యూహాత్మక’ నిల్వలు.
- ఆర్టీఐ పిటిషన్కు కేంద్రం కీలక సమాధానం!
- ఇంధన కొరత వట్టిదే.. ఆర్థిక లావాదేవీల చిక్కే అసలు కారణం.
- తేల్చిచెప్పిన పెట్రోలియం కన్సార్టియం!
- 41 దేశాలతో చమురు బంధం.. హార్ముజ్ దాటిన నౌకలు సురక్షితం.
- భాగ్యనగరంలో ఇంధన సెగ.. 25 శాతం తగ్గిన కొనుగోళ్లు.
- బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షణ!
- జిల్లాల నుంచి నగరానికి పాకిన ‘నో స్టాక్’ బోర్డులు.
- పానిక్ బయింగ్తోనే పెరుగుతున్న ఇబ్బందులు!
హైదరాబాద్, మహా.
భారతదేశంలో ఇంధన నిల్వలపై గత కొద్దిరోజులుగా సాగుతున్న ప్రచారానికి, ఆందోళనలకు కేంద్ర పెట్రోలియం , సహజ వనరుల శాఖ తెరదించింది. ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం పిటిషన్కు సమాధానమిస్తూ, దేశంలో అత్యవసర పరిస్థితుల కోసం కేటాయించిన వ్యూహాత్మక చమురు నిల్వలు మరో 9.5 రోజుల వరకు, అంటే దాదాపు పది రోజులకు సరిపడా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో, దేశీయంగా ఇంధన భద్రతపై వెల్లడైన ఈ గణాంకాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంధనం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, కేవలం పశ్చిమాసియాపైనే ఆధారపడకుండా ఏకంగా 41 దేశాల నుంచి దిగుమతులు జరుపుతూ సరఫరా గొలుసును పటిష్టం చేసుకుంటోంది. హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారత నౌకలు సురక్షితంగా బయటపడటంతో పాటు, దేశవ్యాప్తంగా 53 లక్షల మెట్రిక్ టన్నుల చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించడం ప్రజల్లో ధీమా నింపుతోంది.
అయితే, దేశంలో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమివ్వడానికి కారణం ఇంధన కొరత కాదని, చమురు సంస్థలు మరియు డీలర్ల మధ్య నెలకొన్న అంతర్గత ఆర్థిక లావాదేవీలేనని సౌత్ ఇండియా కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం స్పష్టం చేసింది. ఆయిల్ కంపెనీలు ముందస్తు చెల్లింపుల నిబంధనల్లో మార్పులు చేయడం, క్రెడిట్ పరిమితులపై నెలకొన్న సందిగ్ధత కారణంగా డీలర్లు తమ సాధారణ కొనుగోళ్లను దాదాపు 25 శాతం మేర తగ్గించుకున్నారు. ఈ ఆర్థిక చిక్కుముడి కారణంగానే డీలర్లు కొత్త స్టాక్ తీసుకోవడానికి వెనుకాడటంతో బంకులు మూతపడుతున్నాయి. దీనికి తోడు పెట్రోల్ దొరకదనే వదంతులు తోడవ్వడంతో వాహనదారులు ఒకేసారి బంకులపై పడటం ‘కృత్రిమ కొరత’కు దారితీస్తోంది. ఇది కేవలం సాంకేతిక మరియు పరిపాలనాపరమైన సమస్యే తప్ప, దేశంలో చమురు నిల్వలు లేకపోవడం కాదని డీలర్ల సంఘం నేతలు తేల్చి చెబుతున్నారు.
ఈ ప్రభావం తెలంగాణ రాజధాని హైదరాబాద్పై తీవ్రంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,200 బంకుల్లో, ఒక్క గ్రేటర్ పరిధిలోనే 1,200కు పైగా ఉన్నాయి. నగరంలో రోజువారీ పెట్రోల్, డీజిల్ అవసరాలు 40 నుంచి 70 లక్షల లీటర్ల వరకు ఉండగా, సరఫరాలో వచ్చిన చిన్నపాటి అంతరాయం భారీ క్యూలకు కారణమవుతోంది. మొదట జిల్లాల్లో ప్రారంభమైన ఈ సమస్య, ఇప్పుడు అంబర్పేట్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, నాంపల్లి వంటి ప్రధాన ప్రాంతాలకు పాకింది. స్టాక్ ఉన్న కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. రవాణా రంగంపైనే కాకుండా, పరిశ్రమలు మరియు ఐటీ కంపెనీల వాహనాలపై కూడా ఈ ప్రభావం పడుతోంది. ఇప్పటివరకు క్రెడిట్పై ఇంధనం తీసుకున్న ట్రావెల్ సంస్థలు, ఇప్పుడు బంకులు చేతులెత్తేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలు లేక ఇబ్బందులు పడుతున్నాయి.
ప్రభుత్వ వర్గాలు మాత్రం పరిస్థితిని చక్కదిద్దేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి. ఆయిల్ కంపెనీలతో డీలర్ల సంఘం జరుపుతున్న చర్చలు సఫలమైతే, మరో 24 నుంచి 48 గంటల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని భావిస్తున్నారు. ప్రజలు భయాందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని, అకస్మాత్తుగా ట్యాంకులు నింపుకోవడానికి ఎగబడటం వల్ల స్టాక్ ఉన్న బంకులు కూడా త్వరగా ఖాళీ అవుతున్నాయని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ చేసే వారిపై మరియు వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.






