- పలకరించిన తొలకరి
- దడదడలాడిన భాగ్యనగరం
- రోడ్లపై నిలిచిన నీరు
- ఇక్కట్లకు గురైన వాహనదారులు
హైదరాబాద్, మహా : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రాన్ని తాకాయి. ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన భాగ్యనగరానికి తొలకరి పలకరింపు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని భావించినప్పటికీ.. ఈ వాన మాత్రం సున్నితంగా, ఆనందంగా డాన్సులు వేసేలా లేదు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఉగ్రరూపం దాల్చి నగరవాసులను ఒక్కసారిగా దడదడలాడించింది. మంగళవారం సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా అంధకారమయమై, ఒక భారీ ఉరుముల, మెరుపుల వర్షం నగరంలోకి ప్రవేశించడంతో వాతావరణం క్షణాల్లో మారిపోయింది.
వాతావరణ పరిశీలకుల హెచ్చరికల ప్రకారం.. అమీన్పూర్, పటాన్చెరు, బాచుపల్లి మీదుగా అంచెలంచెలుగా విస్తరించిన ఈ భారీ మేఘాల గుంపు, గంటల వ్యవధిలోనే హైదరాబాద్ మహా నగరాన్ని పూర్తిగా చుట్టేసింది. పశ్చిమ, మధ్య హైదరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్తో పాటు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుముల గర్జనలతో కూడిన కుండపోత వాన కురిసింది. కేవలం గంట వ్యవధిలోనే కొన్ని ప్రాంతాల్లో 40 మి.మీ నుండి 50 మి.మీ వరకు వర్షపాతం నమోదు కావడంతో.. నగర రహదారులు చూస్తుండగానే చెరువులను తలపించాయి. కార్యాలయాలు ముగించుకుని ఇళ్లకు తిరుగు ప్రయాణమైన వేలాది మంది ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఈ ఆకస్మిక వాన దెబ్బకు తడిసి ముద్దయ్యారు.
ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా మాధాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, మియాపూర్, బంజారాహిల్స్, పంజాగుట్ట వంటి రద్దీ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై చేరిన మోకాల్లోతు నీరు, లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన రహదారుల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వానకు తోడు నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడటం, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడం సమస్య తీవ్రతను మరింత పెంచింది.
నగరంలో తలెత్తిన ఈ ట్రాఫిక్ గందరగోళాన్ని చక్కదిద్దడానికి హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందితో కలిసి రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనులను ముమ్మరం చేశారు. వాహనదారులకు సోషల్ మీడియా ద్వారా నిరంతరం అలర్ట్లు జారీ చేశారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వీలైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ నగరవాసులకు కొన్ని కీలక సూచనలు చేసింది. వర్షం పడుతున్న సమయంలో రోడ్లపై ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రోడ్లు జారే ప్రమాదం ఉన్నందున వాహనాల వేగాన్ని తగ్గించి, ముందు వెళ్లే వాహనానికి తగినంత దూరం పాటించాలి. ముఖ్యంగా బైక్ నడిపేవారు ఓవర్ టేక్లు చేయవద్దని, భారీ ఈదురుగాలులు వీచినపుడు చెట్ల కింద, పాత గోడల పక్కన వాహనాలను ఆపకూడదు అని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, రాబోయే రోజుల్లో రుతుపవనాలు మరింత బలపడనున్నందున ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని స్పష్టం చేశారు.








