Mahaa Daily Exclusive

  లీకు వీరులకు షాక్…

Share

  • లీకు వీరులకు షాక్
  • పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 కు లోక్ సభ ఆమోదం
  • వాయిస్ ఓట్ ద్వారా ఆమోదం

న్యూఢిల్లీ, మహా : కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు, 202 కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. దేశంలో పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడం, ప్రశ్నాపత్రాల లీకేజీలు , ఇతర అక్రమాలకు శాశ్వత ముగింపు పలకడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ కొత్త సవరణలను సభ ముందుకు తెచ్చింది. విపక్షాల నిరసనలు, హంగామా మధ్యనే ఈ కీలక బిల్లును లోక్‌సభ వాయిస్ ఓట్ ద్వారా ఆమోదించింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పరీక్షల ప్రామాణికతను, విశ్వసనీయతను కాపాడేందుకు కేంద్రం ఎంతటి కఠినమైన నిర్ణయాలకైనా వెనుకాడదని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై ప్రభుత్వం ఎంతో వేగంగా స్పందించి చర్యలు తీసుకుందని గుర్తుచేసిన ఆయన, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అక్రమార్కుల ఆటకట్టించేలా చట్టపరమైన నిబంధనలను నిరంతరం నవీకరిస్తున్నామని సభకు తెలిపారు. చట్టంలో తెచ్చిన ఈ సవరణలు అభ్యర్థులకు, నిరుద్యోగ యువతకు ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.

అధికారిక గణాంకాలను సభకు వివరించిన మంత్రి జితేంద్ర సింగ్, 2024లో యాంటీ పేపర్ లీక్ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని వెల్లడించారు. అంతేకాకుండా, పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు కారణంగా మనస్తాపానికి గురై విద్యార్థులు చేసుకునే ఆత్మహత్యల శాతంలో ఇటీవలి కాలంలో గణనీయమైన తగ్గుదల కనిపించిందని, ఇది ఈ చట్టం తీసుకొచ్చిన సానుకూల ప్రభావానికి అద్దం పడుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో లీకేజీలకు పాల్పడే వ్యవస్థలపై, ఏజెన్సీలపై మరింత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

చర్చ సందర్భంగా ఉద్రిక్తత

ఈ కీలక బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన కాల్పుల ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యులంటూ కాంగ్రెస్ అగ్రనేత, పక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు సభను తీవ్రంగా కుదిపివేశాయి. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చి తీవ్ర నిరసనలు, నినాదాలు చేపట్టడంతో సభలో విపరీతమైన గందరగోళం ఏర్పడింది. ప్రతిపక్షాల ఆందోళనల నడుమనే కేంద్రం బిల్లును సభ ఆమోదం పొందేలా ముందుకు తీసుకెళ్లింది.

ప్రజా పరీక్షల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేసే ఈ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, ప్రతిపక్షాల నిరసనల ఉధృతి తీవ్రం కావడంతో స్పీకర్ లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు. దేశంలోని లక్షల మంది విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ లీక్ ముఠాలకు నూతన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ చట్టం-2026 ద్వారా సింహస్వప్నంగా మారనుందని ప్రభుత్వ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.