Mahaa Daily Exclusive

  రామాలయ విరాళాల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలి..! రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్..

Share

నాగ్‌పూర్, మహా.

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు చెందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో దీనిని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించాలని సూచించారు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

దోషులకు కఠిన శిక్షలు అవసరం

 

రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాలకు సంబంధించిన అంశంలో ఎలాంటి అవకతవకలు జరిగినా వాటిని ఉపేక్షించరాదని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే సంఘ్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే విడుదల చేసిన ప్రకటననే సంస్థ అధికారిక వైఖరిగా పరిగణించాలని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకోవాలని, దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

 

పారదర్శక వ్యవస్థ అవసరం

 

శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ వ్యవహారాన్ని సాధారణ ఘటనగా కాకుండా అత్యంత గంభీరంగా పరిగణించాలని సంఘ్ సూచించింది. ఆలయ ఆర్థిక నిర్వహణ, విరాళాల వినియోగం, పరిపాలనా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు చేపట్టి పూర్తి పారదర్శకతను తీసుకురావాలని కోరింది. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు ఆధునిక భద్రతా వ్యవస్థలు, కట్టుదిట్టమైన ఆర్థిక పర్యవేక్షణ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

 

భక్తులకు సంయమనం పాటించాలని విజ్ఞప్తి

 

ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు సంయమనం పాటించాలని ఆర్‌ఎస్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే లేదా సమాజంలో అపోహలు సృష్టించే ప్రయత్నాలను ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చింది. వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి వచ్చే వరకు ఓర్పుతో వ్యవహరించాలని సూచించింది.

 

మానసిక ఆరోగ్యంపై భాగవత్ సూచనలు

 

అదే కార్యక్రమంలో మోహన్ భాగవత్ మానసిక ఆరోగ్యం ప్రాధాన్యంపై కూడా మాట్లాడారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా ప్రతి వ్యక్తికి అవసరమని అన్నారు. భారతీయ సంప్రదాయ విజ్ఞానంలో యోగవాశిష్టం, పతంజలి యోగసూత్రాలు మనస్సు నియంత్రణకు శాస్త్రీయ మార్గాలను వివరించాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై విద్యాసంస్థలు మరింత లోతైన పరిశోధనలు చేపట్టాలని సూచించారు.

Latest