- జాతీయ ఉపాధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి.
- ప్రధాన కార్యదర్శిగా స్మృతీ ఇరానీ .
- పీయూష్ గోయల్కు కోశాధికారి బాధ్యతలు.
ఢిల్లీ, మహా.
భారతీయ జనతా పార్టీ జాతీయ సంస్థాగత వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సోమవారం కొత్త జాతీయ కార్యవర్గాన్ని, పార్టీ జాతీయ పదాధికారులను ప్రకటించారు. పార్టీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం కొత్త నియామకాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. రాబోయే రాజకీయ సవాళ్లను దృష్టిలో పెట్టుకుని అనుభవజ్ఞులు, సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ కొత్త బృందాన్ని ఏర్పాటు చేశారు.
కొత్త జాతీయ కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలి బాధ్యతలు దక్కడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత స్మృతీ ఇరానీకి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు.
13 మంది జాతీయ ఉపాధ్యక్షులు
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా మొత్తం 13 మంది సీనియర్ నేతలను నియమించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా, ఉత్తరాఖండ్కు చెందిన తీరథ్ సింగ్ రావత్, రామ్ మాధవ్, ఒడిశాకు చెందిన బైజయంత్ జయ్ పాండా, ఆంధ్రప్రదేశ్కు చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి ఈ జాబితాలో ఉన్నారు.
వీరితో పాటు రేఖా వర్మ, వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషి, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, లాల్ సింగ్ ఆర్య, ప్రొఫెసర్ ఎం. నాగరాజ, ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్, డాక్టర్ మధుచంద్ర కర్లకు కూడా జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు.
ప్రధాన కార్యదర్శులుగా స్మృతీ ఇరానీ, వినోద్ తావ్డే
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల విభాగంలోనూ కీలక మార్పులు చేశారు. మహారాష్ట్రకు చెందిన వినోద్ తావ్డే, కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీతో పాటు సునీల్ బన్సాల్, బిప్లబ్ కుమార్ దేబ్, డాక్టర్ సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియాలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.
స్మృతీ ఇరానీకి మరోసారి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం పార్టీ భవిష్యత్ వ్యూహాల్లో ఆమెకు ప్రాధాన్యం కొనసాగుతోందన్న సంకేతంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
సంస్థాగత బాధ్యతల్లో బీఎల్ సంతోష్ కొనసాగింపు
బీజేపీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించే జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తన బాధ్యతల్లో కొనసాగనున్నారు. సంస్థాగత జాయింట్ జనరల్ సెక్రటరీలుగా శివప్రకాశ్, సౌదాన్ సింగ్లను నియమించారు.
పార్టీ కార్యకలాపాలను క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సమన్వయం చేయడంలో సంస్థాగత విభాగం కీలకంగా వ్యవహరించనుంది.
పీయూష్ గోయల్కు కీలక ఆర్థిక బాధ్యత
బీజేపీ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే జాతీయ కోశాధికారి బాధ్యతలను సీనియర్ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు అప్పగించారు. పార్టీ ఆర్థిక వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వనరులు, సంస్థాగత ఆర్థిక సమన్వయంలో కోశాధికారి పదవికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం
కొత్త జాతీయ కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి దక్కడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. జాతీయ రాజకీయాల్లో అనుభవం ఉన్న ఆమెకు మరోసారి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ ఆంధ్రప్రదేశ్పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది.
మరోవైపు తెలంగాణకు కొత్త జాతీయ పదాధికారుల జాబితాలో ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం దక్కలేదన్న చర్చ మొదలైంది. గతంలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణకు కొత్త జాబితాలో చోటు దక్కలేదు.
సీనియర్లు–కొత్త నాయకత్వంతో సమతుల్య బృందం
రాష్ట్రాలు, ప్రాంతాలు, సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ బీజేపీ అధిష్ఠానం కొత్త బృందాన్ని రూపొందించినట్లు తాజా నియామకాల ద్వారా స్పష్టమవుతోంది. ఒకవైపు సీనియర్ నేతలకు కీలక పదవులు కొనసాగిస్తూనే.. మరోవైపు సంస్థాగత అనుభవం, ఎన్నికల నిర్వహణలో నైపుణ్యం ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగించారు.
పురంధేశ్వరికి జాతీయ ఉపాధ్యక్ష పదవి.. స్మృతీ ఇరానీకి ప్రధాన కార్యదర్శి బాధ్యత.. బీఎల్ సంతోష్ కొనసాగింపు.. పీయూష్ గోయల్కు కోశాధికారి పదవి.. ఇలా బీజేపీ జాతీయ నాయకత్వం కొత్త టీమ్ను ప్రకటించడం ద్వారా రానున్న రాజకీయ పోరాటాలకు సంస్థాగతంగా సిద్ధమవుతున్న సంకేతాలు ఇచ్చింది.







