Mahaa Daily Exclusive

  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ..!

Share

భూపాలపల్లి, మహా :

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం భూపాలపల్లి మండలంలోని ఎస్‌.ఎన్‌.కొత్తపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు, ఇప్పటి వరకు ఎంతవరకు పూర్తి చేశారు, ఏవైనా సాంకేతిక లేదా సామగ్రి సంబంధిత సమస్యలున్నాయా?, ఇసుక ఎక్కడి నుండి తెస్తున్నారని అడిగారు.
ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందజేస్తోందని కలెక్టర్ తెలిపారు.
ఇంటి నిర్మాణం పనులను దశలవారీగా పూర్తి చేస్తూ సంబంధిత ఫోటోలు, వివరాలను వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్మాణం నాణ్యతకు ఎలాంటి రాజీ లేకుండా పని చేయాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన అందించాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన అందించేందుకు ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.
ఎస్‌.ఎన్‌.కొత్తపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, అంగన్‌వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి పాఠాలు చదివించారు. విద్యార్థుల్లో చదువుపట్ల ఆసక్తి పెరిగేలా, అభ్యసనా సామర్థ్యాలు మెరుగయ్యేలా చూడాలన్నారు.

ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం అదనపు సమయం కేటాయించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తక్కువగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్, పిల్లలను చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 5వ తరగతిలో నలుగురు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరిన సందర్భంగా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో వ్యత్యాసం ఏంటని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మంచిగా విద్యాబ్యాసం జరుగుతుందని, ఉపాధ్యాయులు మంచిగా పాఠాలు భోదిస్తున్నారని తెలుపుగా విద్యార్థులను అభినందించారు.పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పూర్తి సంఖ్యలో పుస్తకాలు అందేలా చూడాలని సూచించారు.
అంగన్‌వాడి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, కేంద్రంలో చిన్నారుల నమోదు సంఖ్య, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అంగన్ వాడి టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యం, మాతృ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అంగన్‌వాడి కార్యకర్తలు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఆరోగ్య సమసమాజానికి కృషి చేయాలని సూచించారు. అంగన్ వాడి నుండే బాల్యం బలోపేతం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, డి ఈ ఓ రాజేందర్,ఎంపిడిఓ నాగరాజు, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాయలింగు తదితరులు పాల్గొన్నారు.