Mahaa Daily Exclusive

  రాజ్యసభ రేసులో 16 మంది: సామాజిక సమీకరణాలపై అధిష్టానానికి నివేదిక – పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Share

  • రాజ్యసభ రేసులో ఆ 16 మంది
  • పీసీసీ చీఫ్ కీలక ప్రకటన
  • -ఎమ్మెల్యేలు సహకరించడం లేదని రాహుల్ కు 8మంది డీసీసీల ఫిర్యాదు

హైదరాబాద్, మహా
తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లకోసం కాంగ్రెస్ లో16 మంది రేసులో ఉన్నారని టిపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ఢిల్లీ పిలిచే అవకాశం ఉందన్న ఆయన ఢిల్లీకి పిలుస్తామా లేక ఫోన్లో చర్చిస్తామా అనేది సాయంత్రం వెల్లడిస్తామన్నారు. గాంధీభవన్‌ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన పలు విషయాలు వెల్లడించారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక గురించి నిన్న 30 నిమిషాల చర్చ జరిగిందన్న ఆయన అధిష్టానానికి సామాజిక వర్గాల వారిగా 16 మంది పేర్లను ఇచ్చామన్నారు. అయితే సమర్ధవంతమైన బీసీలు నలుగురు రాజ్యసభ అవకాశం ఇవ్వమని అడుగుతున్నారన్నారు. రాష్ట్రం నుండి ఒకరికి ఇస్తారా? లేదా ఇద్దరికి ఇస్తారా? అనేది బుధవారం తెలుస్తుందన్న ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని అడగడం లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు బీఆర్ఎస్ రాజ్యసభ అవకాశం ఇచ్చింది. తెలంగాణ కోసం పని చేసిన వాళ్ళలో ఒక్కరికైనా బీఆర్ఎస్ రాజ్యసభ అవకాశం ఇచ్చిందా? మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కార్పొరేషన్ పదవులపై కసరత్తు జరుగుతోందని మార్చి నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులు ఇస్తామని ప్రకటించారు.

పాకిస్థాన్ తో చర్చలు జరుపుతారు కానీ మావోలతో జరపరు

పినరయి విజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి సమాధానం చెప్పారని మహేష్‌ కుమార్ గౌడ్ అన్నారు. రాజకీయాల కోసమే పినరయి విజయ్ మాట్లాడుతున్నాడని ఆరోపించారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం మావోయిస్టులు దశాబ్దాలుగా పని చేశారన్నారు. ఆపరేషన్ కగార్ ను మేం వ్యతిరేకించామని చెప్పిన మహేష్‌ కుమార్‌ పాకిస్థాన్ తో చర్చలకు ఒప్పుకున్న మోదీ మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకోలేదని ఎద్దేవా చేశారు. మావోయిస్టు సిద్ధాంతంతో మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కానీ, ప్రజల కోసం పోరాడిన వాళ్లపై గౌరవం ఉంటుందన్నారు.మేమయినా, మావోయిస్టులు అయినా పేద ప్రజల కోసమే పోరాటం చేశామన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానం పలుకుతామన్నారు. మేం ఎవరిని అడగలేదని స్పష్టం చేశారు.

డీసీసీ అధ్యక్షులకు ఎమ్మెల్యేలు సహకరించడం లేదు

కొందరు డీసీసీ అధ్యకులు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారని, 8 చోట్ల ఎమ్మెల్యేలు సహకరించడం లేదని డీసీసీ అధ్యక్షులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ అంశంపై దృష్టి పెట్టమని రాహుల్ గాంధీ తనను ఆదేశించారని తెలిపారు. వెంటనే ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు పీసీసీ చీఫ్‌ వెల్లడించారు. అమాయకుడైన రాహుల్ గాంధీని బీజేపీ నాయకులు ఆడిపోసుకున్నారని, మోదీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ లో అడ్డంగా దొరికిపోయాడన్నారు. మోదీ వ్యవహారంపై బీజేపీ, ఆరెస్సెస్ సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్‌ చేశారు.

Latest