Mahaa Daily Exclusive

  సాంప్రదాయాలు పాటించాల్సిందే..! జ్ఞాన స‌ర‌స్వ‌తి అభివృద్దిపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి..

Share

  • సాంప్రదాయాలు పాటించాల్సిందే
  • భక్తుల విశ్వాసాలకు పెద్ద పీట వేయాలి
  • ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హా నిబంధ‌న‌లు
  • సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా బాస‌ర ఆల‌య అభివృద్ధి ప‌నులు
  • జ్ఞాన స‌ర‌స్వ‌తి అభివృద్దిపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

 

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో ప్ర‌ముఖ ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హాలో నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజ‌కీయ పార్టీల స‌భ‌లు, జెండాలు, ప్ర‌ద‌ర్శ‌నలు లేకుండా ఆధ్యాత్మికత‌కు పెద్దపీట వేయాల‌ని సీఎం సూచించారు. బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తి దేవాల‌య అభివృద్ధి ప‌నుల‌పై ముఖ్య‌మంత్రి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు ప‌వ‌ర్‌ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి వివ‌రించారు. ఆల‌య అభివృద్ధి ప‌నుల‌కు రూ. 225 కోట్లు అవసరమవుతాయని అధికారులు తెలియ‌జేశారు. మాస్ట‌ర్‌ప్లాన్‌ను ప‌రిశీలించిన సీఎం ప‌లు మార్పులు సూచించారు. సంప్ర‌దాయాలు, శాస్త్రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని భ‌క్తుల విశ్వాసాల‌కు పెద్ద‌పీట వేస్తూ బాస‌ర ఆల‌య అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. భ‌విష్య‌త్ అవ‌స‌రాలు, భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని విశాల‌మైన రోడ్లు నిర్మించాల‌ని సీఎం ఆదేశించారు. ఆల‌య ప్రాంగణం భ‌విష్య‌త్‌లో భారీ వృక్షాల‌తో అల‌రారేలా అవ‌స‌ర‌మైన మొక్క‌లు నాటాల‌ని సీఎం సూచించారు. ఆల‌యం స‌మీపంలో హెల్త్ సెంట‌ర్ నిర్మించాల‌ని, పుష్క‌రాలు, ఇత‌ర ఉత్స‌వాల రోజుల్లో అక్క‌డ త‌గిన సంఖ్య‌లో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భ‌క్తుల‌కు సేవ‌లు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. ఎంత‌టి ప్ర‌ముఖుల వాహ‌నాలైనా ఆల‌య ప్రాంగ‌ణానికి బ‌య‌టే నిలిచిపోవాల‌ని, ఆల‌య ప్రాంగ‌ణంలోకి కేవ‌లం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాల‌ని సీఎం ఆదేశించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సీఎం సూచించారు. వాహ‌నాల పార్కింగ్ ప్ర‌దేశంలో సోలార్ రూప్‌టాప్ ఏర్పాటు చేయాల‌న్నారు. అభివృద్ధి ప‌నుల స‌మ‌యంలో ఆల‌య ప‌విత్ర‌త‌కు ఎటువంటి భంగం కల‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అభివృద్ది ప‌నుల నాణ్య‌త‌లో రాజీప‌డితే ఏమాత్రం స‌హించేది లేద‌ని సీఎం హెచ్చ‌రించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.