* పార్టీ విస్తరణకు పవన్ కల్యాణ్ శ్రీకారం!
* కేరళలో భారీగా జనసేనలోకి చేరికలు.
*’కండువాలు కప్పి ఆహ్వానించిన నాగబాబు, రామ్ తాళ్లూరి.
* 200 మందికి పైగా కేరళ నేతల చేరికతో సరికొత్త రికార్డు.
* తిరువనంతపురంలో స్థానిక నేతలతో కీలక సమాలోచనలు.
తిరువనంతపురం, మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక సుస్థిరమైన, చెరగని ముద్ర వేసుకుని అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ.. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలపై దృష్టి సారించింది. దశాబ్ద కాలంగా ప్రజాక్షేత్రంలో అలుపెరగని పోరాటం చేసి, నేడు ప్రభుత్వంలో భాగస్వామిగా విశేష సేవలు అందిస్తున్న జనసేనాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భావజాలం ఇప్పుడు భాషలు, ప్రాంతాలకు అతీతంగా జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందుతోంది. ప్రజల పక్షాన నిలబడే ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న పొరుగు రాష్ట్రాల నేతలు, తమ ప్రాంతాల్లోనూ జనసేన పార్టీని విస్తరించాలని బలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ‘దేవుని సొంతగడ్డ’గా పిలిచే కేరళ రాష్ట్రంలో జనసేన పార్టీ విస్తరణకు చకచకా అడుగులు పడుతున్నాయి. పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు కేరళ రాజధాని తిరువనంతపురంలో అగ్ర నేతలు పర్యటించి స్థానిక నాయకులతో కీలక సమాలోచనలు జరపడం, ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున వందలాది మంది నాయకులు జనసేన తీర్థం పుచ్చుకోవడం జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
**తిరువనంతపురంలో ముమ్మరంగా సమాలోచనలు**
కేరళలో జనసేన పార్టీని విస్తరించాలని అక్కడి స్థానిక నాయకులు చేసిన విజ్ఞప్తి, పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు, జనసేన సీనియర్ నేత కే. నాగబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ కేరళ రాష్ట్రంలో విస్తృత పర్యటన చేపట్టారు. రాజధాని తిరువనంతపురంలో కేరళకు చెందిన పలువురు స్థానిక నాయకులతో వారు లోతైన చర్చలు జరిపారు. భవిష్యత్తులో కేరళ గడ్డపై జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, స్థానిక సమస్యలపై ఎలా పోరాడాలి అన్న అంశాలపై వారు సుదీర్ఘంగా సమాలోచనలు పంచుకున్నారు. జనసేన ఆవిర్భావం నుంచి పదేళ్ల పాటు ప్రజాక్షేత్రంలో చేసిన పోరాటాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ప్రత్యక్షంగా చేస్తున్న సేవలు, అనుసరిస్తున్న అభివృద్ధి పనులను చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తమ రాష్ట్రంలో జనసేన విధానాలను అవలంబించాలని కోరుకోవడం అత్యంత శుభ పరిణామమని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా జనసేన సిద్ధాంతాలు ఒకే విధంగా ఉంటాయని, అయితే రాజకీయంగా ఆయా స్థానిక అంశాలు, అక్కడి ప్రజల సమస్యలకు అనుగుణంగా పార్టీ విధి విధానాలు ఉంటాయని ఆయన వివరించారు.
**దక్షిణ భారతదేశం వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ**
శ్రీ పవన్ కల్యాణ్ గారి భావజాలం భాషలకు, ప్రాంతాలకు అతీతంగా దేశస్థాయిలో ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పేర్కొన్నారు. కేవలం కేరళ మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశం వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో జనసేన పార్టీ విస్తరణ కోసం ఆయా ప్రాంతాల నుంచి తమకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారి స్పష్టమైన ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి, జనసేన పార్టీ విస్తరణకు అవసరమైన అన్ని రకాల ప్రణాళికలు, ప్రయత్నాలు ముమ్మరంగా చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జనసేన పార్టీ యువజన నాయకులు గోకుల రవీందర్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ మాధవరెడ్డి తదితరులు పాల్గొని కేరళ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.
**జనసేనలోకి క్యూ కట్టిన కేరళ అగ్ర నేతలు**
తిరువనంతపురంలో జరిగిన ఈ కీలక సమావేశం అనంతరం కేరళ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కే. నాగబాబు, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ సమక్షంలో, స్థానిక నాయకుల నేతృత్వంలో వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు భారీ ఎత్తున జనసేనలో చేరారు. నేషనల్ లేబర్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, హిందుస్థాన్ అవామీ మోర్చా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, మరియు కాంగ్రెస్ పార్టీల నుంచి సుమారు రెండు వందల మందికి పైగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాగబాబు, తాళ్లూరి రామ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జనసేన పార్టీ భవిష్యత్తులో అనుసరించబోయే విధానాలను, సిద్ధాంతాలను నూతన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆట్టింగల్ నియోజకవర్గం నుండి కే. డానియెల్స్, పీ. రామ్ సాగర్, త్రివేండ్రం నుండి ఎస్.కే. దిలీప్ కుమార్, కాలికట్ నుండి జొఫీ అథెలి, బిజు కే మాథుర్, కొచ్చి నుండి ఎం.కే. అంబేద్కర్తో పాటు త్రిసూర్, మలప్పురం, వయనాడ్, ఎర్నాకులం తదితర కీలక నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు జనసేన గూటికి చేరడంతో కేరళలో పార్టీకి బలమైన పునాది పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.







