మెలోడీ స్వీట్ డిప్లమసీ: బెంగళూరులో సరికొత్త డెజర్ట్ క్రేజ్.
* ఇంటర్నెట్ను షేక్ చేసిన ‘మెలోడీ’ ట్రెండ్.
* భోజన ప్రియుల కోసం ప్రత్యేక మెనూ.
*ప్రధాని మోదీ బహుమతి స్ఫూర్తితో రెస్టారెంట్లలో నోరూరించే వంటకాలు.
బెంగళూరు,మహా.
అంతర్జాతీయ దౌత్యం, ఇంటర్నెట్ సంస్కృతి కలగలిసి ఒక అద్భుతమైన వంటకానికి స్ఫూర్తిగా నిలిస్తే ఎలా ఉంటుందో బెంగళూరు వాసులు ఇప్పుడు ప్రత్యక్షంగా రుచి చూస్తున్నారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనికి ఇచ్చిన చిన్న బహుమతి దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలను ఏ స్థాయిలో హోరెత్తించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోదీ ఆమెకు మన దేశానికి చెందిన ఐకానిక్ ‘మెలోడీ’ చాక్లెట్లను బహుమతిగా ఇవ్వడంతో ‘మెలోడీ’ హ్యాష్ట్యాగ్ మరోసారి ఇంటర్నెట్లో ట్రెండింగ్గా మారింది. ఆ చిరునవ్వుల దౌత్యం స్ఫూర్తితో బెంగళూరుకు చెందిన ప్రముఖ చెఫ్ అభిజిత్ సాహా భోజన ప్రియుల కోసం ఒక సరికొత్త, అద్భుతమైన లిమిటెడ్-ఎడిషన్ డెజర్ట్ మెనూను తీసుకువచ్చారు.
నగరంలోని ప్రసిద్ధ రెస్టారెంట్లు అయిన ‘రోస్మారినో’, ‘లైఫ్’ లలో ఈ ప్రత్యేక మెనూను అందుబాటులోకి తెచ్చారు. దౌత్య వేదికలపై రెండు దేశాల అధినేతలు పంచుకున్న మధురమైన క్షణాలను, ఒకప్పటి మనందరి ఇష్టమైన మెలోడీ చాక్లెట్ రుచిని కలబోసి ఆయన ఈ అద్భుత సృష్టికి ప్రాణం పోశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ క్షణాన్ని ఒక తీపి జ్ఞాపకంగా మార్చాలనే ఉద్దేశంతో ఆయన ఈ ‘మెలోడీ’ సిరీస్కు రూపకల్పన చేశారు. దేశ విదేశాలకు చెందిన వంటకాలను అందించడంలో ప్రావీణ్యం ఉన్న చెఫ్ అభిజిత్ సాహా చేసిన ఈ వినూత్న ఆలోచనకు స్థానిక భోజన ప్రియుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
ఈ ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ మెనూలో నోరూరించే అనేక రకాల డెజర్ట్లను పొందుపరిచారు. ప్రధానంగా మోదీ-మెలోనిల పేరు మీదుగా రూపొందించిన ‘మెలోడీ హాట్ చాక్లెట్’ చూపరులను, చాక్లెట్ ప్రియులను ఇట్టే ఆకర్షిస్తోంది. దీనికి తోడు పక్కా మెలోడీ చాక్లెట్ ఫ్లేవర్తో మిలియనీర్స్ కేక్, లావా కేక్, బ్రౌనీ, ట్రైఫిల్ వంటి విభిన్న రకాల డెజర్ట్లను కస్టమర్లకు అందిస్తున్నారు. ప్రతి వంటకంలోనూ ఆ పాతకాలపు మెలోడీ చాక్లెట్ రుచిని ఆధునిక వంటకాలకు అన్వయిస్తూ, అద్భుతమైన ఫ్లేవర్లు వచ్చేలా చెఫ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రెండు దేశాల నేతల మధ్య జరిగిన ఒక ఆహ్లాదకరమైన పరిణామం కేవలం వార్తలకే పరిమితం కాకుండా, ఒక మధురమైన వంటకంగా మారి బెంగళూరు ప్రజల ముందుకు రావడం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్గా మారింది. మోదీ బహుమతితో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన మెలోడీ.. ఇప్పుడు సరికొత్త రూపంలో విభిన్నమైన రుచులను పంచుతుండటం విశేషం.







