కొల్లాపూర్, మహా : ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడిని ఆచరణలో చూపిస్తూ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిట్నెస్పై తనకున్న మక్కువను చాటుకున్నారు. ఆదివారం ఉదయం కొల్లాపూర్ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బావిలో ఆయన గంటపాటు ఈత కొట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మనిషి సంపాదించే సంపద కంటే ఆరోగ్యమే అతిపెద్ద పెట్టుబడి అని పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని ఒక భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిరోజూ కనీసం గంటపాటు యోగ, ధ్యానం, వాకింగ్, జాగింగ్, రన్నింగ్ లేదా స్విమ్మింగ్ వంటి శారీరక శ్రమతో కూడిన పనులు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన సూచించారు. వ్యాయామం కేవలం శరీర దారుఢ్యానికే కాకుండా, ఒత్తిడిని దూరం చేసి మానసిక ఉల్లాసాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు.








