- రైలు కింద పడి భర్త ఆత్మహత్య
- వరంగల్ జిల్లా కాజీపేటలో ఘటన
కాజీపేట, మహా : వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో వీడియో కాల్ మాట్లాడుకుంటూ, ఆమెకు చూపిస్తూ.. ఎదురుగా వస్తున్న రైలు కింద పడి రాజేశ్ నాయక్ (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం రాత్రి జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు రాజేశ్ నాయక్ వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలంగా రాజేష్ భార్యకు, ఆయన తల్లిదండ్రులకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి మరోసారి భార్యతో గొడవ జరిగింది. రాజేశ్ తీవ్ర మనస్తాపానికి గురై ఇల్లు వదిలి బయటకు వెళ్లిపోయాడు. ఆపై రైలు పట్టాల మీదకు చేరుకుని, భార్యకు నేరుగా వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్తూ ఎదురుగా వస్తున్న రైలును చూపించాడు. నిజంగానే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భర్త రాజేష్ తనను కేవలం భయపెట్టడానికే అలా చేస్తున్నాడని భావించిన భార్య ఆ విషయాన్ని లైట్ తీసుకుంది.
మరోవైపు రాజేశ్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాత్రంగా బంధువులు, స్నేహితులు, సన్నిహితుల ఇండ్లు, పలు చోట్ల వెతికారు. మరుసటి రోజు ఉదయం కాజీపేట సమీపంలోని రైలు పట్టాలపై ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు వెళ్లి చూశారు. అది రాజేష్ మృతదేహమేనని గుర్తించి వారు కన్నీళ్లు పెట్టుకున్నాడు. మృతుడు రాజేష్కు భార్యతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.








