- జైలు గోడ దూకి పరారైన పోక్సో కేసు నిందితుడు
- మహబూబ్ నగర్ జిల్లా జైలులో ఘటన
మహబూబ్ నగర్, మహా : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఒక నిందితుడు జిల్లా జైలు నుంచి సినిమా ఫక్కీలో తప్పించుకు పారిపోయాడు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిశోర్ రెడ్డి మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గత 25 రోజులుగా రిమాండ్లో ఉన్న కిశోర్ రెడ్డి, జైలు నుంచి పారిపోయేందుకు పక్కా ప్లాన్ వేశాడు. ఇందుకోసం తోటి ఖైదీల టవళ్లను సేకరించినట్లు తెలుస్తోంది. జైలు బాత్రూం పైకి ఎక్కి, రక్షణ గోడపైకి చేరుకున్నాడు. అనంతరం సేకరించిన టవళ్లను ఒకదానికొకటి గట్టిగా ముడివేసి, తాడులా మార్చి గోడ అవతలి వైపునకు జారి తప్పించుకున్నాడు.
ఖైదీ పరారీని గుర్తించిన జైలు అధికారులు వెంటనే స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, జైలు నుంచి పారిపోయిన అనంతరం నిందితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఇంటికి వస్తున్నట్లు చెప్పగా, వారు వద్దని వారించినట్లు పోలీసులు గుర్తించారు. జైలు భద్రతా వైఫల్యంపై జైళ్ల శాఖ డీఐజీ రహస్యంగా విచారణ జరపినట్టు సమాచారం. నిందితుడి కోసం ఆత్మకూరు, వనపర్తి పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు.








