Mahaa Daily Exclusive

  పూరీ సంప్రదాయాలతో జగన్నాథ రథోత్సవం…

Share

పూరీ సంప్రదాయాలతో జగన్నాథ రథోత్సవం.
* బంగారు చీపురుతో రథం ముందు శుభ్రం చేసిన సీఎం.
అమరావతి, మహా.
రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్ర ఆధ్యాత్మిక వైభవానికి నాంది పలికింది. గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ మహోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంప్రదాయ వస్త్రధారణలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూరీ సంప్రదాయాలను అనుసరిస్తూ రథం ముందు బంగారు చీపురుతో శుభ్రం చేసి, అనంతరం జగన్నాథ స్వామి రథాన్ని భక్తులతో కలిసి లాగడం విశేషంగా నిలిచింది.

సంప్రదాయ క్రతువులతో రథయాత్ర ప్రారంభం

అమరావతిలో తొలిసారిగా జరిగిన జగన్నాథ రథయాత్రకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో నిర్వహించే సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతరం అమరావతి విశ్వనగరంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో రాజధాని బృహత్ ప్రణాళిక చిత్రపటాన్ని తలపై ధరించి ప్రార్థనలు చేశారు. పూరీ సంప్రదాయంలో భాగంగా రథం ముందు బంగారు చీపురుతో శుభ్రం చేసి, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మల రథాన్ని తాడుతో లాగారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

‘ఈ రథయాత్రలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం’

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిలో తొలి జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ అవకాశం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. పూరీలో జరిగే జగన్నాథ రథయాత్రకు ప్రపంచవ్యాప్తంగా విశిష్ట స్థానం ఉందని, అందరికీ అక్కడికి వెళ్లే అవకాశం ఉండదని చెప్పారు. అలాంటి పవిత్ర కార్యక్రమాన్ని ఇకపై ప్రతి సంవత్సరం అమరావతిలో నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ప్రకటించడం సంతోషకరమని తెలిపారు.

ఇస్కాన్, అక్షయపాత్ర సేవలకు ప్రశంసలు

ఆధ్యాత్మిక సేవతో పాటు ప్రజాసేవలోనూ ఇస్కాన్, అక్షయపాత్ర ఫౌండేషన్‌లు విశేష కృషి చేస్తున్నాయని చంద్రబాబు కొనియాడారు. దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు పోషకాహారం అందించడం గొప్ప సేవ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పది కేంద్రీకృత వంటశాలల ద్వారా ప్రతిరోజూ సుమారు లక్షా ఎనభై వేల మంది విద్యార్థులకు అక్షయపాత్ర ఫౌండేషన్ భోజనం అందిస్తోందని తెలిపారు. సమాజ నిర్మాణంలో సేవా సంస్థల పాత్ర ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని, సామాజిక మాధ్యమాల ప్రభావం కారణంగా కుటుంబ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబాల్లో పెరుగుతున్న విభేదాలు, ఆత్మహత్యలు, చిన్నారులపై దాడులు వంటి ఘటనలు సమాజానికి హెచ్చరికలని పేర్కొన్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు ఆధ్యాత్మికతే సరైన మార్గమని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీలో ఐదు వేల శ్రీవారి ఆలయాల నిర్మాణం

రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల శ్రీవారి ఆలయాలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చంద్రబాబు ప్రకటించారు. దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా సమాజానికి ప్రశాంతత, ఆధ్యాత్మిక చైతన్యం అందించే కేంద్రాలని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇస్కాన్ వంటి సంస్థలతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని వెల్లడించారు.

అమరావతి, పోలవరం పూర్తి చేయడమే ప్రభుత్వ సంకల్పం

రాష్ట్ర పునర్నిర్మాణంలో అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన సమయంలో అమరావతిలో వర్షం కురవడం శుభసూచకమని పేర్కొంటూ, జగన్నాథ స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఆధ్యాత్మికత, అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణను సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.