Mahaa Daily Exclusive

  తెలంగాణలో సినిమా టికెట్‌ ధరలపై కొత్త జీవో..

Share

• స్పెషల్‌ థియేటర్లకు ప్రత్యేక కేటగిరీ.
• భారీ బడ్జెట్‌ సినిమాలకు తొలి 10 రోజులు టికెట్‌ ధరల పెంపునకు అవకాశం.

హైదరాబాద్‌, మహా.
తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సినిమా థియేటర్లను వర్గీకరిస్తూ కొత్తగా ‘స్పెషల్‌ థియేటర్‌’ కేటగిరీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం కొత్త జీవో జారీ చేసింది. అధునాతన సౌండ్‌, స్క్రీన్‌ సదుపాయాలు ఉన్న థియేటర్లకు ఈ ప్రత్యేక కేటగిరీ వర్తించనుంది.

కొత్త నిబంధనల ప్రకారం 7.1 సౌండ్‌ వ్యవస్థ, 2కే లేదా 4కే ప్రొజెక్షన్‌ సదుపాయం ఉన్న థియేటర్లను స్పెషల్‌ కేటగిరీలోకి తీసుకురానున్నారు. అయితే థియేటర్‌లోని మొత్తం సీట్లలో కనీసం 25 శాతం నాన్‌-ప్రీమియం సీట్లు ఉండేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సాధారణ ప్రేక్షకులకు అందుబాటులో ఉండే టికెట్‌ ధరల సీట్లు కూడా తప్పనిసరిగా కొనసాగనున్నాయి.

రోజుకు ఐదు షోలకు అనుమతి

థియేటర్లలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు రోజుకు గరిష్ఠంగా ఐదు షోలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సినిమా ప్రదర్శనల సమయాల విషయంలో థియేటర్‌ యాజమాన్యాలకు కొంత వెసులుబాటు లభించనుంది.

చిన్న సినిమాలకు కూడా థియేటర్లు, షోలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కీలక నిబంధన విధించింది. చిన్న సినిమాలకు ప్రతిరోజూ కనీసం ఒక షో తప్పనిసరిగా ప్రదర్శించాలి. దీనివల్ల భారీ బడ్జెట్‌ చిత్రాల కారణంగా చిన్న సినిమాలకు థియేటర్లు దొరకకపోవడం, షోలు తగ్గిపోవడం వంటి సమస్యలను కొంతవరకు నివారించవచ్చని భావిస్తున్నారు.

రూ.100 కోట్లకు పైబడిన చిత్రాలకు ‘సూపర్‌ హైబడ్జెట్‌’ హోదా

రూ.100 కోట్లకు పైగా నిర్మాణ వ్యయం ఉన్న సినిమాలను ప్రభుత్వం ‘సూపర్‌ హైబడ్జెట్‌’ చిత్రాలుగా గుర్తించింది. ఇలాంటి సినిమాలకు విడుదలైన తొలి 10 రోజుల పాటు టికెట్‌ ధరలను పెంచుకునే అవకాశం కల్పించింది. భారీ పెట్టుబడులు పెట్టే నిర్మాతలకు, అధిక వ్యయంతో తెరకెక్కించే చిత్రాలకు ఈ వెసులుబాటు ఉపయోగపడనుంది.

అయితే టికెట్‌ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంపై ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. పెరిగిన టికెట్‌ ధరల ద్వారా లభించే ఆదాయంలో కొంత భాగాన్ని సినీ కార్మికుల సంక్షేమ నిధికి అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కార్మికుల సంక్షేమ నిధికి గరిష్ఠంగా రూ.కోటి వరకు విరాళం ఇవ్వడం తప్పనిసరి చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ప్రేక్షకులు, నిర్మాతలు, కార్మికుల ప్రయోజనాల మధ్య సమతుల్యం

కొత్త మార్గదర్శకాల్లో ఒకవైపు అధునాతన సదుపాయాలు, భారీ పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు టికెట్‌ ధరల విషయంలో వెసులుబాటు కల్పిస్తూనే.. మరోవైపు సాధారణ ప్రేక్షకులకు నాన్‌-ప్రీమియం సీట్లు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. అదే సమయంలో చిన్న సినిమాలకు రోజుకు కనీసం ఒక షో తప్పనిసరి చేయడం ద్వారా వాటికి థియేటర్లలో ప్రదర్శన అవకాశాలు కల్పించే ప్రయత్నం చేసింది.

సినీ పరిశ్రమ అభివృద్ధి, ప్రేక్షకులపై టికెట్‌ ధరల భారం, చిన్న సినిమాల మనుగడ, థియేటర్‌ యాజమాన్యాల ప్రయోజనాలు, సినీ కార్మికుల సంక్షేమం వంటి అంశాలను సమతుల్యం చేసేలా కొత్త విధానం రూపొందించినట్లు ప్రభుత్వ తాజా జీవోతో స్పష్టమవుతోంది.

Latest