Mahaa Daily Exclusive

  జమ్మూకశ్మీర్‌ భారత్‌లో ముఖ్యమైన భాగం..! అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ కీలక వ్యాఖ్యలు..

Share

• అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ కీలక వ్యాఖ్యలు.
• సీఎం ఒమర్‌ అబ్దుల్లాతో భేటీ.. ట్రావెల్‌ అడ్వైజరీపై పునఃపరిశీలన.

శ్రీనగర్‌, మహా.

జమ్మూకశ్మీర్‌పై అమెరికా వైఖరికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ బుధవారం శ్రీనగర్‌లో పర్యటిస్తూ జమ్మూకశ్మీర్‌ భారత్‌లో ముఖ్యమైన భాగమని స్పష్టం చేశారు. రెండు రోజుల జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ పర్యటనలో భాగంగా శ్రీనగర్‌ చేరుకున్న ఆయన.. జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్‌పై అమెరికా వైఖరిని వెల్లడించారు.

జమ్మూకశ్మీర్‌కు రావడం ఇదే తన తొలి పర్యటన అని సెర్జియో గోర్‌ తెలిపారు. కశ్మీర్‌ అందమైన ప్రాంతమని, ఇక్కడికి రావడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. సీఎం ఒమర్‌ అబ్దుల్లాతో జరిగిన సమావేశం ఫలప్రదంగా సాగిందని, ఇరువురి మధ్య చర్చించిన అంశాలపై తదుపరి చర్చలు ఢిల్లీ, వాషింగ్టన్‌లో కొనసాగుతాయని చెప్పారు.

ట్రావెల్‌ అడ్వైజరీపై సమీక్ష

జమ్మూకశ్మీర్‌కు అమెరికా పౌరులు వెళ్లడంపై ప్రస్తుతం అమల్లో ఉన్న ట్రావెల్‌ అడ్వైజరీపై కూడా గోర్‌ స్పందించారు. అమెరికా ప్రభుత్వం తన ప్రయాణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన అనంతరం ట్రావెల్‌ అడ్వైజరీని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అయితే దీనిపై తక్షణమే ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

భద్రతా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో కశ్మీర్‌కు అమెరికా నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రావెల్‌ అడ్వైజరీలో సడలింపులు వస్తే జమ్మూకశ్మీర్‌ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభించే అవకాశముంది.

ఒమర్‌ అబ్దుల్లాతో కీలక చర్చలు

అమెరికా రాయబారి సెర్జియో గోర్‌, సీఎం ఒమర్‌ అబ్దుల్లా భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. జమ్మూకశ్మీర్‌ పరిస్థితులు, ప్రాంతీయ భద్రత, పర్యాటకం, భారత్‌–అమెరికా సంబంధాలకు సంబంధించిన అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. స్థానిక పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు గోర్‌ చేపట్టిన ఈ పర్యటనకు అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.

అమెరికా రాయబారి పర్యటనకు ముందే సీఎం ఒమర్‌ అబ్దుల్లా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన సమస్యలకు పరిష్కారం ఢిల్లీ నుంచే రావాలని, మరో దేశ రాయబారికి తన దేశంపై ఫిర్యాదు చేయడం తన విధానం కాదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

లద్దాఖ్‌లోనూ పర్యటన

రెండు రోజుల పర్యటనలో భాగంగా సెర్జియో గోర్‌ జమ్మూకశ్మీర్‌తో పాటు లద్దాఖ్‌లోనూ పర్యటించనున్నారు. కశ్మీర్‌ను భారత్‌లోని ముఖ్యమైన భాగంగా అమెరికా రాయబారి బహిరంగంగా పేర్కొనడం, అదే సమయంలో అక్కడి పరిస్థితులను పరిశీలించి ట్రావెల్‌ అడ్వైజరీపై పునఃపరిశీలన చేస్తామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Latest