ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణానికి తాగునీరు అందించే లాండ సాంగ్వి వాగులో పూడిక తీసి నీటి లభ్యత పెరిగేలా చేసారు. దీంతో పూర్తిగా ఎండిపోయిన వాగులో మళ్లీ జలకళ సంతరించుకుని నీటి ఎద్దడి తీరనుంది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ బండారి సతీష్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల వాగు ఎండిపోయిన సందర్భంలో వాగును సందర్శించి భూగర్భ నీటి మట్టం లోతు పెంచి ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ను ఆయన లేఖ ద్వారా కోరడంతో అధికారులు పూడిక తీత పనులు చేపట్టినట్టు తెలిపారు. పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి తీరేలా చేసిన కంది శ్రీనివాస రెడ్డికి వెంటనే స్పందించి నిధులు విడుదల చేసిన జిల్లా కలెక్టర్ కు మున్సిపల్ కమీషనర్ సిబ్బందికి పట్టణ ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు ధన్యవాదాలు తెలిపారు.







