వరంగల్ నగరంలోని బట్టల బజార్ లోని శ్రీ బాలా నగర వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగింది. ఉదయం 9 గంటలకు అంకురార్పణతో ప్రారంభమై స్వామి వారి మూల మంత్ర హవనం, స్వామి వారిని, అమ్మవారిని, రామానుజుల వారిని ఆలయంలోని ఉప దేవతలను ఆలయానికి పవిత్ర ఆరోపణ జరిపించారు. అనంతరం తీర్థ ప్రసాద గోష్ఠితో ఉదయం కార్యక్రమాలు ముగిసాయి. సాయంత్రం 6 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ సామూహిక పారాయణం, మూలమంత్ర హవన, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్ఠితో కార్యక్రమములు అంత్యంత వైభవంగా ముగిసాయి. ముఖ్యంగా శ్రావణ మాసం మొదటి శనివారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు స్వామి వారి ఉచిత లడ్డూ ప్రసాదంగా అందజేసినట్లు ఆలయ ఈఓ ఎలపాటి రత్నాకర్ రెడ్డి, చైర్మన్ పరాశరం శ్రీనివాస చార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయలోని వివిధ సేవా సమితుల సభ్యులు పాల్గొన్నారు. ఈనెల 27 ఆదివారం మూల మంత్ర హవనం, నిత్య కార్యక్రమాలు, 28 సోమవారం శ్రీ గోదా అమ్మవారి తిరు నక్షత్రం (జన్మ దినము) ఉదయం 108 కళాశాలతో స్వామి వారికి, అమ్మవారికి రామానుజులకు స్నపనం (అభిషేకం) నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 6 గంటల నుంచి మహిళలచే సామూహిక కుంకుమ పూజలను నిర్వహిస్తారు. కుంకుమ పూజలకు కావలసిన సామాగ్రి సేవా సమితి నిర్వాహకులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కావున మహిళా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి పూజలో పాల్గొనాలని కోరారు.







