హైదరాబాద్, మహా : తెలంగాణ కుంభమేళాగా పిలుచుకొనే మేడారం జాతరకు సంబంధించి ఆదివాసీ గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ, భక్తులకు సౌకర్యాలు వంటి ప్రాధాన్యతా అంశాలతో కూడిన మాస్టర్ ప్లాన్కు తుదిరూపు ఇవ్వడం జరిగిందని వరంగల్ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం లభించిన వెంటనే ఆధునీకరణ పనులు ప్రారంభించి వందరోజుల్లోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి మేడారం మహాజాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన దర్శనం, ఇతర సౌకర్యాలు లభించే విధంగా అంగుళం తేడా లేకుండా శాస్త్రోపకరంగా సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనలు, సలహాలను ప్రతి అంశంలోనూ పరిగణనలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందని తెలిపారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ మాస్టర్ ప్లాన్పై సమీక్షించారు.
గద్దెలను అభివృద్ది డిజైన్ సమ్మక్క సారలమ్మ ప్రధాన ద్వారం డిజైన్ , ప్రహారీగోడ నిర్మాణానికి అవసరమైన రాతి డిజైన్ గద్దెల అభివృద్ది తర్వాత అదనంగా ఎంత విస్తీర్ణం పెరుగుతుంది వంటి అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అభివృద్ది పనులకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ను రెండు రోజుల్లో సమర్పించాలని మాస్టర్ ప్లాన్ తయారుచేసిన కన్సల్టెన్సీని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులు స్వయంగా మేడారం వెళ్లి అక్కడి పూజారులు, స్ధానిక ప్రజల అందరి అభిప్రాయాలను తీసుకొని గద్దెల డిజైన్ తయారు చేయడం జరిగిందన్నారు. గతంలో భక్తులకు క్యూలైన్ల వలన పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనం సరిగా లభించేదికాదు. మహాజాతర సమయంలో ఇది భక్తులకు ఇబ్బందికరంగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు భక్తుల సౌకర్యార్ధం గద్దెల ప్రాంగణాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి గాంచిందని, ఇది గిరిజన సంప్రదాయ రీతికి దర్పణం పడుతుందని తమ కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, వనదేవతలుగా సమ్మక్క సారలమ్మలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారని తెలిపారు. సమ్మక్క సారలమ్మల త్యాగం, ఔన్నత్యం మరింత చాటి చెప్పేలా ఆలయ ప్రాంగణం రూపకల్పన జరుగుతోందని తెలిపారు. మేడారం ఆలయం తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని అన్ని దేవాలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






