- రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి..
- అనుకూల వాతావరణం.. వ్యాపారవేత్తలు ముందుకు రావాలి
- కెనడా హైకమిషనర్ ను కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- సీఎంతో భేటీ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, ఏరోస్పేస్ అంశాలపై చర్చ
హైదరాబాద్, మహా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. తెలంగాణ–కెనడా సంబంధాలను మరింత బలపరిచే దిశగా ఈ భేటీ కొనసాగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, ఏరోస్పేస్, రక్షణ రంగం, పట్టణ మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాల్లో కెనడా భాగస్వామ్యాన్ని విస్తరించే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల గురించి కెనడా హైకమిషనర్ బృందానికి వివరించారు.
పెట్టుబడులకు అనుకూల వాతావరణం..
వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కెనడా వ్యాపారవేత్తలు పెట్టుబడులతో ముందుకు రావాలన్నారు. పారిశ్రామిక రంగాలతో పాటు స్టార్టప్లు, విద్యా సంస్థలు, అధునాతన సాంకేతిక కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో క్రిస్టోఫర్ కూటర్ సతీమణి కరెన్, కెనడా మంత్రి ఎడ్ జాగర్, ట్రేడ్ కమిషనర్ విక్రమ్ జైన్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు







