Mahaa Daily Exclusive

  మరో అల్ప పీడనం…మూడు రోజులు భారీ వర్షాలు…

Share

హైదరాబాద్, మహా : తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా భారత వాతావరణ శాఖ ఓ కీలక అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా, మంగళవారం బంగాళాఖాతం లో మరో అల్ప పీడనం ఏర్పడనుందనే అంచనాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొంథా తుఫాను బీభత్సం నుంచి తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. ఈ నెల 4వ తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడతాయని వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది.

ఏపీలోని ఉత్తర కోస్తాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమలోనూ మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు పడతాయని వాతవరణ శాఖ అంచనా వేస్తోంది. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రానున్న మూడు రోజుల వానలు కురుస్తా యని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అండమాన్ లో అల్పపీడనం ఏర్పడితే ఆ ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అండమాన్ లో ఏర్పడే అల్పపీడనం బలపడితే భారీ వర్షాలు మరోసారి తప్పవని అంచనా వేస్తున్నారు. ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వెల్లడించింది

Latest