- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యమంలా అవేర్ నెస్ కార్యక్రమాలు చేపట్టాలి
- సైబర్ కేటుగాళ ప్రధాన లక్ష్యం మహిళలు, వృద్ధులే
- సైబర్ క్రైమ్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, మహా : సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. ఫోన్ కాల్, సోషల్ మీడియా, ఆన్లైన్ ఇంటరాక్షన్తోనే సైబర్ కేటుగాళ్లు నేరాలు చేస్తున్నారని తెలిపారు. పాత నేరస్థుల మాదిరిగానే కొత్త నేరస్థులు కూడా డేటాను సులభంగా సేకరిస్తున్నారన్నారు. ధనవంతులెవరు, ఏ ప్రాంతంలొ ఉంటారన్న వివరాలన్నీ తెలుసుకొని.. వారినే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఇది సాధారణ సమస్య కాదని.. ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని పేర్కొన్నారు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో సైబర్క్రైమ్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ శివధర్రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, సైబర్ అవేర్నెస్ కార్యక్రమం లాగాకాకుండా, దీనిని ఒక ఉద్యమంలా తీసుకోవాలని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఇంట్లో ఉన్న మహిళలు, వృద్ధులు, గృహిణులు సైబర్ కేటుగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారుతున్నారన్నారు. మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లు చేసి భయపెట్టి మోసం చేస్తున్నారన్నారు. ప్రజలు అత్యంత మెలకువగా ఉండాల్సిన సమయం ఇదని తెలిపారు. యువకులు, రిటైర్డ్ వ్యక్తులు, ప్రముఖులు అందరూ కూడా ఈ అవేర్నెస్లో భాగం కావాలని కోరారు.
సైబర్ అవేర్నెస్ గురించి ఒకరు పదిమందికి, పది మంది ఇరవై మందికి చెబితే ఇది పెద్ద మాస్ మూవ్మెంట్ అవుతుందని ఉద్ఘాటించారు. సైబర్ నేరగాళ్లకు అత్యంత అడ్డంకి ప్రజల అవగాహనేనని తెలిపారు. హైదరాబాద్లో సైబర్ అవేర్నెస్ ఉన్నప్పటికీ, ఇంకా బాధితులు ఉన్నారని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ బాధితులు తగ్గేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 24 గంటలు ‘సైబర్ పెట్రోలింగ్’ ద్వారా పనిచేస్తోందని వివరించారు. మోసాల అవకాశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నేరస్థులు ఎప్పుడూ పోలీసుల కంటే ఒక అడుగు ముందుండేందుకు ప్రయత్నిస్తారన్నారు. అందుకే ప్రజల్లో సైబర్ అవేర్నెస్ అవగాహన మరింత అవసరమని వివరించారు. రూరల్ ఏరియాల్లో కూడా ఇలాంటి క్యాంపెయిన్ విస్తరిస్తామని తెలిపారు. హైదరాబాద్ సిటీలో ఇది ప్రారంభం మాత్రమేనని.. త్వరలోనే మొత్తం తెలంగాణలో సైబర్ అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.







