ఇంటి జాగాకు ‘రాజముద్ర !
• తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.
• డబుల్ రిజిస్ట్రేషన్లకు ఫుల్స్టాప్.
• డిజిటల్ రికార్డులతో పారదర్శకత.
ఖమ్మం బ్యూరో, మహా.
తెలంగాణలో ఆస్తి కొనుగోలు అంటేనే భయం, ఆందోళన అనే రోజులకు ఇక కాలం చెల్లిపోనుంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతి, అక్రమాలకు చరమగీతం పాడుతూ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లు కేవలం సాగు భూములకే పరిమితమైన ‘పట్టా’ విధానాన్ని, ఇకపై ఇండ్లు మరియు ఖాళీ స్థలాలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించడం ఒక చారిత్రక మలుపు.
*సామాన్యుడికి భరోసా.. యాజమాన్య హక్కు పత్రం*
భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థలో అత్యంత కీలకమైన మార్పు ‘టైటిల్ డీడ్’ (యాజమాన్య హక్కు పత్రం) జారీ చేయడం. ఇప్పటివరకూ ఇండ్లు లేదా ప్లాట్ల విషయంలో కేవలం రిజిస్ట్రేషన్ దస్తావేజులు మాత్రమే ఆధారంగా ఉండేవి. కానీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో, వ్యవసాయ భూములకు పాస్బుక్ ఇచ్చినట్లే, ఇండ్లు మరియు స్థలాలకు కూడా ప్రభుత్వం పక్కాగా యాజమాన్య హక్కు పత్రాన్ని జారీ చేస్తుంది. దీనివల్ల ఆస్తిపై యజమానికి పూర్తి భద్రత లభించడమే కాకుండా, భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినట్లవుతుంది.
*అవినీతికి చెక్*
రిజిస్ట్రేషన్ల శాఖలో మానవ ప్రమేయాన్ని తగ్గించి, టెక్నాలజీని వజ్రాయుధంగా మార్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ‘బ్లాక్ చైన్’ సాంకేతికతను ప్రవేశపెడుతున్నారు. ఈ విధానం ప్రత్యేకత ఏమిటంటే, ఒకసారి ఆస్తి వివరాలు సాఫ్ట్వేర్లో నమోదైతే, ఇక ఆ డేటాను మార్చడం గానీ, ట్యాంపరింగ్ చేయడం గానీ సాక్షాత్తు ఆ శాఖ అధికారులకు కూడా సాధ్యం కాదు. దీనివల్ల పాత తేదీలతో దొంగ రిజిస్ట్రేషన్లు చేయడం, రికార్డులు మాయం చేయడం వంటి అక్రమాలకు శాశ్వతంగా తెరపడుతుంది.
*డబుల్ రిజిస్ట్రేషన్లు ఇక అసాధ్యం*
ఒకరికి అమ్మిన ఆస్తిని మరొకరికి అమ్మడం, ఒకే స్థలానికి రెండు రిజిస్ట్రేషన్లు చేయడం వంటి మోసాలు అమాయక ప్రజలను కోర్టుల చుట్టూ తిప్పుతున్నాయి. కొత్త సాఫ్ట్వేర్ విధానంలో ప్రతి సర్వే నంబర్ను డిజిటల్గా లాక్ చేస్తారు. ఒక సర్వే నంబర్లో ఉన్న మొత్తం విస్తీర్ణం, జరిగిన రిజిస్ట్రేషన్లు, మిగిలిన స్థలం వివరాలు ఆన్లైన్లో స్పష్టంగా ఉంటాయి. ఉన్న భూమి కంటే ఒక్క గజం ఎక్కువ అమ్మాలని చూసినా, లేదా ప్రభుత్వ నిషేధిత జాబితాలోని భూములను రిజిస్టర్ చేయాలని ప్రయత్నించినా సిస్టమ్ ఆ లావాదేవీని అక్కడికక్కడే తిరస్కరిస్తుంది. సబ్ రిజిస్ట్రార్ల ప్రమేయం లేకుండానే సాఫ్ట్వేర్ స్వయంగా అక్రమాలను అడ్డుకోవడం ఈ వ్యవస్థలోని గొప్ప విషయం.
*లేఅవుట్ మోసాలకు ఫుల్స్టాప్*
రియల్ ఎస్టేట్ వెంచర్లలో పార్కులు, రోడ్ల కోసం వదిలిన స్థలాలను కూడా ప్లాట్లుగా మార్చి అమ్మేస్తున్న ఉదంతాలు కోకొల్లలు. ఇకపై ఇలాంటి మోసాలు సాగవు. లేఅవుట్ ప్లాన్ అప్రూవల్ సమయంలోనే రోడ్లు, కామన్ ఏరియాలను సాఫ్ట్వేర్లో ఫ్రీజ్ చేస్తారు. ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం అసాధ్యం. అలాగే, వెంచర్ విస్తీర్ణం, ప్లాట్ల కొలతలు సరిపోలితేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుంది.
*డిజిటల్ రికార్డులతో పారదర్శకత*
ఆస్తి చరిత్రను తెలుసుకోవడం ఇకపై సులభం కానుంది. 1983 నుంచి ఉన్న ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) వివరాలను డిజిటలైజ్ చేసి కొత్త విధానానికి అనుసంధానిస్తున్నారు. దీనివల్ల గత 40 ఏళ్లుగా ఆ ఆస్తి ఎవరెవరి చేతులు మారింది, లింక్ డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయం కొనుగోలుదారుడికి క్షణాల్లో తెలిసిపోతుంది. మొత్తంగా చూస్తే, ఈ సంస్కరణలు అమలైతే సివిల్ తగాదాలు సగానికి పైగా తగ్గుముఖం పడతాయని, సామాన్యుడి ఆస్తికి ప్రభుత్వమే రక్షకభటుడిగా నిలుస్తుందని చెప్పవచ్చు.





