- ఫాల్కాన్ గ్రూప్ స్కాం
- విమానం అమ్మేసేందుకు సిద్దమైన ఈడీ
- వచ్చిన డబ్బులను బాధితులకు పంచాలని నిర్ణయం
హైదరాబాద్, మహా : ఫాల్కన్ గ్రూప్ పెట్టుబడుల మోసానికి సంబంధించిన భారీ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక అడుగు వేసింది. నిందితుడికి చెందిన సీజ్ చేసిన ‘హాకర్ 800’ విమానాన్ని వేలం వేయడానికి ఈడీ సన్నాహాలు చేస్తోంది. ఈ విమానం వేలం డిసెంబర్ 9న ఎంఎస్టీసీ లిమిటెడ్ ద్వారా బేగంపేట విమానాశ్రయంలో జరగనుంది. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని భారీ పెట్టుబడుల మోసంలో నష్టపోయిన బాధితులకు పరిహారంగా చెల్లించడానికి ఈడీ నిర్ణయం తీసుకుంది.
కేసు నేపథ్యం ఇది
ఫాల్కాన్ గ్రూపునకు చెందిన క్యాపిటల్ ప్రొటెక్షన్ అనే సంస్థ ఇన్వాయిస్ డిస్కౌంట్ పథకం పేరుతో ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేసింది. ఈ పథకం ద్వారా అమాయక ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి, నిధులను దుర్వినియోగం చేశారు. బాధితుల ఫిర్యాదుల మేరకు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫాల్కన్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన అమర్దీప్ కుమార్పై కేసులు నమోదు చేసింది. ప్రాథమిక దర్యాప్తులో ఫాల్కాన్ గ్రూపు మొత్తం రూ.792 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు తేలింది. ఈ భారీ మోసం, నిధుల మళ్లింపుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి, మనీ లాండరింగ్ కింద మరో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. మోసం ద్వారా ప్రజల నుంచి కొల్లగొట్టిన డబ్బుతో అమర్దీప్ కుమార్ పెద్దఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఈ ఆస్తుల్లో ఒక విమానం కూడా ఉంది. తనపై కేసులు నమోదు కాగానే అమర్దీప్ కుమార్ తాను కొనుగోలు చేసిన ఆ విమానంలోనే దేశం విడిచి విదేశాలకు పారిపోయాడు, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.
అయితే విదేశాలకు పారిపోయిన తర్వాత తన విమానాన్ని అద్దెకు ఇచ్చాడు. అది శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాగా ఈడీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హ్యాంగర్ ఛార్జీలు తగ్గించడానికి దీనిని తర్వాత బేగంపేటకు తరలించారు. విమానం సీజ్ చేసిన తర్వాత ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద అడ్జుడికేటింగ్ అథారిటీకి దరఖాస్తు చేయగా ఈ ఏడాది ఆగస్టులో అది విమానం అటాచ్మెంట్ను ధృవీకరించింది. ఈడీ దరఖాస్తును అడ్జుడికేటింగ్ అథారిటీ నవంబర్ 20న ఆమోదించడంతో.. హైదరాబాద్ జోనల్ ఆఫీస్ వేలాన్ని నిర్వహించడానికి మార్గం సుగమమైంది. విమానం వేలం ద్వారా లభించిన నిధులను మోసపోయిన అమాయక ప్రజలకు అందించేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది.







