- మంత్రి పొంగులేటికి పోలీసుల షాక్
- కుమారుడు హర్షపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు
- రాఘవ కన్ స్ట్రక్షన్ పై 7 సెక్షన్ ల కింద కేసులు నమోదు
హైదరాబాద్, మహా : గత నెల 30 వ తేదీన వట్టినాగులపల్లిలోని ఓ భూమిలోకి ప్రవేశించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యక్తులు అక్కడి గోశాలను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసుస్టేషన్ లో పొంగులేటి కొడుకు హర్షతో పాటు ఆయన కంపెనీపై కేసు నమోదైంది. ఆయనతో పాటు రాఘవ కన్స్ట్రక్షన్స్పై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. భూకబ్జా వెనుక రాఘవ కన్స్ట్రక్షన్ హస్తం ఉన్నదని, తమ భూమిని ఆక్రమించడానికి వచ్చిన వ్యక్తులు కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ పేరే చెప్పారని పల్లవీషా అనే మహిళా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ 30న అర్థరాత్రి వట్టినాగులపల్లిలోని ఘటనా స్థలానికి పదుల సంఖ్యలో బౌన్సర్లను తీసుకెళ్లి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. పోలీసులు అక్కడికి వెళ్లే సమయానికి బౌన్సర్ల అరాచకం కొనసాగుతూనే ఉంది. అదే గ్రౌండ్లో పోలీసులు బౌన్సర్లను నిలువరించి, వారిని తరిమివేసినట్టు సమాచారం. పల్లవీషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు రాఘవ కన్స్ట్రక్షన్ బిల్డర్స్తోపాటు మరికొందరి మీద 329(3), 118(1), 324(4), 304(2), 127(2), 351(2) రెడ్ విత్ 3(5)సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు.
తమ పూర్వీకులకు చెందిన భూమిలో తాము సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ కుటుంబానికి చెందిన వ్యక్తులే దౌర్జన్యాలకు పాల్పడుతూ, మంత్రి బలంతో తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సతీశ్షా కుమార్తె పల్లవీషా ఆరోపించారు. తమ మధ్య కుటుంబ తగాదాలున్నాయని తెలిపారు. తమ భూమిని దక్కించుకోవడానికి అధికార పార్టీ బలంతో కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వారు కొనుగోలు చేసిన సర్వే నంబర్లో తక్కువగా ఉన్న భూమిని తమ భూమిలో చూపించి ఆక్రమించుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. అధికారపార్టీ నేతలతో తమకు ప్రాణహాని ఉన్నదని ఆరోపించారు.
బాధితురాలు తెలిపిన ప్రకారం
గండిపేట మండలం, వట్టినాగులపల్లి గ్రామంలో సర్వే నం.245/19లో సతీశ్షా అనే వ్యక్తికి 3 ఎకరాల స్థలం ఉంది. అది గండిపేట చెరువుకు ఆనుకొని ఉన్న లేక్వ్యూ పాయింట్ బిట్టు. ఈ స్థలంలోకి అక్టోబర్ 25న రాత్రి 11గంటల సమయంలో చొచ్చుకువచ్చిన దుండగులు ప్రహరీ గోడను ధ్వంసం చేశారు. తిరిగి నవంబర్ 30న దాదాపు 70 మంది బౌన్సర్లు ట్రక్కులు, రిజిస్ట్రేషన్ నంబర్ లేని నాలుగు బుల్డోజర్లతో విరుచుకపడి ప్రహరీగోడను, ఆ స్థలంలో ఉన్న గోశాలను కూల్చివేశారు. అడ్డం వచ్చిన వారిని చితకబాదారు. సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన టెంట్ను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. గోశాలలో ఉన్న ఫ్యాన్లు, ఇతర వస్తువులను ధ్వంసం చేసి, సిబ్బంది సెల్ఫోన్లను లాక్కెళ్లారు. ఇదే విషయం సతీశ్ షా కుమార్తె పల్లవీషా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పల్లవీ షా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంత్రి కుమారుడపై కేసు నమోదు చేయడంతో పాటు ఆయనకు సంబంధించిన కన్ స్ట్రక్షన్ కంపనీపై కూడా కేసు కట్టారు.






