- నేడు ఆదిలాబాద్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన
- ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష
- ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
ఆదిలాబాద్, మహా : పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నెరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా స్పెషలిస్ట్ క్యాంపును ఆయన ప్రారంభిస్తారు. అనంతరం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించే సన్నాహక సమావేశంలో పాల్గొంటారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష
నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో ఆయా జిల్లాల ఐడీఓసీల నుంచి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్పై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ ను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
పర్యటన వివరాలు:
మధ్యాహ్నం 1:55 గంటలకు: ఆదిలాబాద్ మహాలక్ష్మివాడలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు: సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో అదనపు డార్మిటరీ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు: బేల మండలం ధోప్తాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరవుతారు.








