*ఇన్స్టాగ్రామ్ రీల్స్తో ‘వలపు’ వల.
* సంపన్నుల పిల్లలే లక్ష్యంగా సాగుతున్న భారీ మోసం గుట్టురట్టు.
హైదరాబాద్:మహా.
సోషల్ మీడియా వేదికగా రంగుల లోకాన్ని చూపిస్తూ, అమాయక యువతులను, ముఖ్యంగా సంపన్న కుటుంబాలకు చెందిన బాలికలను ట్రాప్ చేస్తున్న ఒక ప్రమాదకరమైన ముఠా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పరిచయం పెంచుకుని, ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ఈ ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో ప్రధాన నిందుతుడు కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్తో పాటు అతని సోదరుడు రాజీవ్ను పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.
ఈ ముఠా పనితీరు అత్యంత ప్రణాళికాబద్ధంగా సాగుతోంది. కేవలం 23 ఏళ్ల వయసున్న అర్జున్, తన సోదరుడు రాజీవ్తో కలిసి ఏకంగా పది మంది సభ్యులతో ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. వీరి ప్రధాన లక్ష్యం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి విలాసవంతమైన ప్రాంతాల్లో నివసించే సంపన్నుల పిల్లలే. ఇన్స్టాగ్రామ్లో ఆకర్షణీయమైన రీల్స్ పోస్ట్ చేస్తూ, తాము కూడా పెద్ద ధనవంతులమని కలరింగ్ ఇస్తూ యువతుల దృష్టిని ఆకర్షిస్తారు. ఆపై మాటలు కలిపి, ప్రేమ పేరుతో వల వేసి, పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తారు. నమ్మకం కుదిరిన తర్వాత రకరకాల కారణాలు చెప్పి వారి నుండి భారీగా డబ్బులు లాగడం వీరి వృత్తిగా మారింది.
గత రెండేళ్ల వ్యవధిలో ఈ కిలాడీ సోదరుల చేతిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 20 మందికి పైగా బాలికలు మోసపోయినట్లు విచారణలో తేలింది. తాజాగా నగరంలోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను ప్రేమ పేరుతో ట్రాప్ చేసిన అర్జున్, ఆమె నుండి ఏకంగా 13 లక్షల రూపాయలు వసూలు చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల ఆచూకీ కనిపెట్టారు. పరారీలో ఉన్న వీరిద్దరినీ బెంగళూరులో పట్టుకుని హైదరాబాద్కు తరలించారు.
అర్జున్పై ఇప్పటికే నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మోసం కేసులు నమోదయ్యాయి. మైనర్ బాలికలను కూడా లక్ష్యంగా చేసుకోవడంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆకర్షణీయమైన మాటలు నమ్మి వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ముఠాలోని ఇతర సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.








