Mahaa Daily Exclusive

  కేరళం సీఎంగా వీడీ సతీశన్…

Share

  • కేరళం సీఎంగా వీడీ సతీశన్
  • ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
  • 10 రోజుల సస్పెన్స్‌కు తెర
  • కార్యకర్తలు, మిత్రపక్షాల అభిప్రాయాలకు ఓకే చెప్పిన అధిష్టానం

కొచ్చి, మహా : మే 4న కేరంం శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన దాదాపు 10 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై స్పష్టత ఇచ్చింది. అధిషటానం క్లియరెన్స్ ఇవ్వడంతో సతీశన్ కేరళం తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 140 స్థానాలున్న కేరళం అసెంబ్లీలో 102 స్థానాలు గెలుచుకున్న యూడీఎఫ్‌ కూటమికి సారథ్యం వహించిన ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన పది రోజుల వరకు ముఖ్యమంత్రి ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అధిష్ఠానం ముందు ముగ్గురు కీలక నేతలు వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేషన్ చెన్నితల రేసులో నిలిచారు. మెజారిటీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్ వైపు మొగ్గు చూపినప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌, సామాన్య ప్రజానీకం సతీశన్ వైపు నిలబడటంతో కాంగ్రెస్ ఆ పేరును ఎంపిక చేసింది. పార్టీ కార్యకర్తల నుంచి ఒత్తిడి, యూడీఎప్ మిత్ర పక్షాలైన ముస్లీం లీగ్ వంటి పార్టీల మద్దతుతో కాంగ్రెస్ హైకమాండ్ సతీశన్ వైపు మొగ్గు చూపింది.

క్యాంపస్ రాజకీయాల నుంచి క్లిఫ్ హౌస్ వరకు

1964మే 31న ఎర్నాకులం జిల్లా నెట్టూరులో జన్మించిన సతీశన్, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండే వారు. మహాత్మా గాంధీ యూనివర్శిటీ యూనియన్ ఛైర్మన్‌గా పని చేసిన ఆయన తర్వాత నేషనల్ స్టూడెంట్స్ యూనియన్‌ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా ఎదిగారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన సతీశన్, సుమారు పదేళ్ల పాటు కేరళం హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1996లో రాజకీయాల్లోకి వచ్చి పరవూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత నిరంతరం ప్రజల్లో ఉంటూ 2001లో అదే స్థానం నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పటి నుంచి నేటి వరకు పరవూరును అజేయమైన కోటగా మార్చుకున్నారు. 2026 ఎన్నికల ప్రచారంలో యూడీఎఫ్‌ వంద శాతానికిపైగా సీట్లు సాధిస్తుంది ఆయన ముందే చెప్పారు. కేరళంలో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే విషయంపై జాప్యం జరిగింది. పది రోజులుగా ఈవిషయాన్ని సాగదీయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ఇతర సీనియర్ పార్టీ నాయకులు హాజరైన ఒక ఉన్నత స్థాయి కాంగ్రెస్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పేరు ప్రకటించారు. 140 మంది సభ్యులున్న కేరళం అసెంబ్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించింది. అయినప్పటికీ, ముఖ్యమంత్రిని నిర్ణయించడంలో జరిగిన జాప్యంపై ప్రశ్నలు తలెత్తాయి.

ముఖ్యమంత్రి పేరును ప్రకటించడంలో జాప్యం చేసినందుకు ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీని విమర్శించగా, పార్టీలో కూడా అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. వయనాడ్‌లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సమీపంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను విమర్శిస్తూ పోస్టర్లు వెలిశాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక సెంటిమెంట్ నెలకొని ఉన్నప్పటికీ, ఈ ఇద్దరు నాయకులు కేసీ వేణుగోపాల్‌ను కేరళం ముఖ్యమంత్రిని చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆ పోస్టర్లలో విమర్శలు చేశారు.

సతీశన్ ఎంపికపై అసంతృప్తి లేదు: కేసీ వేణుగోపాల్‌

కేరళ సీఎంగా వీడీ సతీశన్‌ ఎంపికను స్వాగతిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. సతీశన్‌ ఎంపికపై ఎలాంటి అసంతృప్తి లేదని వెల్లడించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. సతీశన్‌ నాయకత్వంలో కేరళ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. “సతీశన్‌ ఎంపికపై ఎలాంటి అసంతృప్తి లేదు. నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తాను. కాంగ్రెస్‌లో హైకమాండ్‌ నిర్ణయమే శిరోధార్యం. అన్నిరకాలుగా ఆలోచించే అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది” అని కేసీ వేణుగోపాల్‌ అన్నారు.