Mahaa Daily Exclusive

  హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత….

Share

  • హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత
  • ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం
  • పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు

ఇంటర్నెట్ డెస్క్, మహా : ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి హోర్ముజ్ జలసంధి మరోసారి రణక్షేత్రంగా మారింది. ఇరాన్ సైనిక చర్యలను అడ్డుకునేందుకు అమెరికా మెరుపు దాడులు నిర్వహించింది. బుధవారం అర్ధరాత్రి అత్యంత కీలకమైన స్థావరాలపై డ్రోన్ లతో విరుచుకుపడింది. బందర్ అబ్బాస్‌ నౌకాశ్రయం సమీపంలోని ఇరాన్ నియంత్రణ కేంద్రమే లక్ష్యంగా జరిగిన ఈ దాడులు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితిని మరింత పెంచుతూ అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంలోని సైనిక లక్ష్యాలపై దాడులు చేసింది. హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ ప్రయోగించిన నాలుగు వన్‌వే అటాక్ డ్రోన్లను అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు గాలిలోనే అడ్డుకుని ధ్వంసం చేశాయి. దీనికి కొనసాగింపుగా, ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌ నౌకాశ్రయ నగరం సమీపంలో ఉన్న ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌పై అమెరికా క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల వల్ల ఐదో డ్రోన్ ప్రయోగాన్ని అమెరికా అడ్డుకోగలిగింది.

నౌకలకు ప్రమాదం ఉందని దాడులు

ఈ దాడులు కేవలం ఆత్మరక్షణ కోసం చేసినవని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా అధికారుల కథనం ప్రకారం బంద్ అబ్బాస్ సమీపంలోని ఆ కేంద్రం నుంచి అమెరికా నౌకలపై మరిన్ని డ్రోన్లను ప్రయోగించేందుకు ఇరాన్ సిద్ధమమవుతోంది. ఆ ప్రాంతంలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు, అమెరికా సైనిక బలగాలకు ఈ కేంద్రం వల్ల తీవ్రమైన ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ డిఫెన్సివ్ స్ట్రైక్స్ నిర్వహించినట్టు వైట్ హౌస్ వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బందర్ అబ్బాస్‌ ప్రాంతంలో భారీ పేలుళ్లు జరిగాయి. అమెరికా క్షిపణులు ఇరాన్ సైనిక మౌలికసదుపాయాలను తాకగానే ప్రాంతంలోని ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. కనీసం మూడు భారీ పేలుళ్లు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్ పూర్తి చేసిందని, దీని వల్ల డ్రోన్ల ముప్పు తొలగిపోయిందని ప్రకటించాయి.

ట్రంప్ కీలక వ్యాఖ్యలు

మరోపక్క దాడులు జరుగుతున్న టైంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఫ్రీఫాల్లో ఉందని, అక్కడ ద్రవ్యోల్బణం 250 శాతానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రస్తుతం అత్యంత బలహీన స్థితిలో ఉందని, వారు శాంతి చర్చల కోసం తహతహలాడుతున్నారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. చర్చల పేరుతో ఇరాన్ చేస్తున్న ప్రచారాన్ని ట్రంప్ ఖండించారు. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను నియంత్రించేదుకు ఒమన్, ఇరాన్ మధ్య ఒప్పంద కుదిరిందన్న వార్తలను వైట్ హౌస్ తోసిపుచ్చింది. అటువంటి మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ ఏదీ లేదని, అది కేవలం కల్పితమని స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధి ఒక అంతర్జాతీయ జలమార్గమని, దానిపై ఏ ఒక్క దేశం నియంత్రణను అమెరికా అంగీకరించబోదని ట్రంప్ కచ్చితమైన హెచ్చరికలు జారీ చేశారు.

వణికిపోతున్న ప్రపంచం
హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతానికి పైగా బాధ్యత వహిస్తుంది. ఇక్కడ చిన్నపాటి ఉద్రిక్తత తలెత్తినా అది అంతర్జాతీయంగా ముడి చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత మూడు నెలలుగా కొసాగుతున్న ఈ ఘర్షణల వల్ల ఇప్పటికే ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఈ ఘర్షణలు ఫిబ్రవరి 28 నుంచి కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు నిత్యకృత్యమయ్యాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం నామమాత్రంగానే కనిపిస్తోంది.