Mahaa Daily Exclusive

  అన్ని వ‌స‌తుల‌తో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయండి…

Share

  • అన్ని వ‌స‌తుల‌తో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయండి
  • కార్గో.. ఎంఆర్‌వో వ‌స‌తులు క‌ల్పించాలి
  • హ్యాంగర్ ఏర్పాటుకు అత్యంత అనుకూలం
  • దేవ‌ర‌క‌ద్ర‌లో డీఆర్‌డీవో ప్రాజెక్టు మంజూరు చేయండి
  • ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి
  • గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు భూములు బ‌ద‌లాయించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన సీఎం

న్యూఢిల్లీ, మహా : భార‌త వాయు సేన ఆధ్వ‌ర్యంలో నిర్మించ‌నున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అన్ని వ‌స‌తుల‌తో అభివృద్ధి చేయాల‌ని రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలోని ర‌క్ష‌ణ శాఖ కార్యాల‌యం క‌ర్త‌వ్య భ‌వ‌న్‌లో రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు ర‌క్ష‌ణ శాఖ భూములు బ‌ద‌లాయించినందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒక‌టైన ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూసేక‌ర‌ణ‌, యుటిలిటీస్ బ‌ద‌లాయింపు అంశాల్లో పూర్తిగా స‌హ‌కరిస్తామ‌ని కేంద్ర మంత్రికి సీఎం తెలియ‌జేశారు. ఆదిలాబాద్‌లో భార‌తీయ వాయు సేన ఆధ్వ‌ర్యంలో రానున్న ఎయిర్‌పోర్ట్ దేశ స‌మ‌గ్ర‌త‌, ర‌క్ష‌ణ‌కు సంబంధించిన అంశమైనందున‌, దానిని భారీగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అన్ని విధాలా స‌హ‌క‌రిస్తామ‌ని రక్ష‌ణ‌శాఖ మంత్రికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. భార‌త వాయుసేన టెర్మిన‌ల్‌తో పాటు ప్ర‌యాణికుల సౌక‌ర్యార్ధం నిర్మించ‌నున్న పౌర విమాన‌యాన శాఖ‌కు చెందిన టెర్మిన‌ల్ బిల్డింగ్‌తో పాటుగా కార్గో, ఎంఆర్‌వో, హ్యాంగ‌ర్ సౌక‌ర్యాల‌ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఇటీవ‌ల మ‌ధ్య ఆసియాలో చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన ఎయిర్‌లైన్స్ త‌మ హ్యాంగ‌ర్స్‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికి స‌రైన ప్ర‌దేశాల‌ను అన్వేషిస్తున్నాయ‌ని, హ్యాంగర్ ఏర్పాటుకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అత్యంత అనుకూల‌మైనందున ఆ దిశ‌గా అభివృద్ధి చేయాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. త‌మ కీల‌కమైన ప్రాజెక్టు ఏర్పాటుకు డీఆర్‌డీవో/డీఆర్‌డీఎల్ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా దేవ‌ర‌క‌ద్ర స‌మీప ప్ర‌దేశాన్ని ఎంపిక చేసుకున్నందున ఆ ప్రాజెక్ట్‌ను త్వ‌ర‌గా మంజూరు చేయాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. స‌మావేశంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ వికాస్‌రాజ్‌, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కే.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, ముఖ్యమంత్రి కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ కోఆర్డినేష‌న్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.