- మంత్రి ఉత్తమ్ ను ఎందుకు బయట ఉంచారని ప్రశ్న
- నీటి కేటాయింపులపై సీఎం రేవంత్ కు అవగాహన లేదని వ్యాఖ్య
- గుంపు మేస్త్రీ తెలంగాణ ముంచే మేస్త్రీ కావద్దని హితవు
హైదరాబాద్, మహా : ఇటీవల కర్ణాటకలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చీకటి ఒప్పందాలు ఏంటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. కర్ణాటకలో మూడు రాష్ట్రాల సీఎంలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను కూడా లోపలికి రానీయకుండా నలుగురే కూర్చుని ఏం ఒప్పందాలు చేసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు తీవ్ర నష్టం కలిగించేలా కర్ణాటకలో నవేలి, ఏపీలో గుండ్రేవుల ప్రాజెక్టులు కడతామంటుంటే మన ముఖ్యమంత్రి చారిత్రక ఒప్పందం అంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో గుండ్రేవులకు నీళ్లు ఇవ్వబోమని ట్రిబ్యునల్ చెప్తే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాన్ని రానీయకుండా అడ్డుకున్నామని, కానీ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి తన శిష్యుడైన తెలంగాణలో సీఎం అయ్యాడనే ధీమాతో మళ్లీ ఆ ప్రాజెక్టును ముందుకు తెచ్చారని ఆరోపించారు.
ఆర్డీఎస్ కు పక్కా నీటి కేటాయింపులపై ఏమైనా స్పష్టమైన హామీ వచ్చిందా అని ప్రశ్నిస్తూ, రేవంత్ రెడ్డికి నీటి వాటాలపై కనీస అవగాహన లేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కాంప్రమైజ్ అయినా బీఆర్ఎస్ అస్సలు ఒప్పుకోదని స్పష్టం చేశారు. గత అరవై ఏళ్లలో కాంగ్రెస్ ఏడాదికి సగటున 4 టీఎంసీల చొప్పున అనుమతులు తెస్తే, బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఏడాది 44 టీఎంసీల చొప్పున పర్మిషన్లు తెచ్చామని గుర్తుచేశారు. మనకు రావాల్సిన 968 టీఎంసీలలో 830 టీఎంసీలకు అనుమతులు తెచ్చుకున్నామని, ఇంకా 138 టీఎంసీల అనుమతులు రావాల్సి ఉందని వివరించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా ‘బనకచర్ల’ ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోయిందని, ఆ నిద్రను తట్టిలేపింది బీఆర్ఎస్సేనని చెప్పారు.
పాలమూరు పేరిట సమ్మక్క సారక్క ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఎండబెడుతున్నారని, తాగేందుకు మంచి నీళ్లు లేక పాలమూరు తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలోని మేడిగడ్డ గేట్లను రిపేర్ చెయ్యడం చేతకాదు గానీ, తుంగభద్ర గేట్ల రిపేర్ కోసం రేవంత్ రెడ్డి వెళ్తున్నారని విమర్శించారు. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డికి హిట్లర్ స్ఫూర్తి అయితే, నీళ్ల విషయంలో రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి స్ఫూర్తి అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. గుంపు మేస్త్రి అయిన రేవంత్ రెడ్డి, తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావొద్దని హరీష్ రావు హితవు పలికారు. కాంగ్రెస్ వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ సుజలం, కర్ణాటక సుఫలం, తెలంగాణ నిష్ఫలంగా మారుతోందని, కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు ఒక్క చుక్క నీటి విషయంలో అన్యాయం జరిగినా కేసీఆర్, బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తే లేదని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.







