Mahaa Daily Exclusive

  డబ్బు రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి జబ్బు..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..

Share

  • విలువలతో కూడిన రాజకీయాలు మళ్లీ రావాలి
  • కష్టపడే గుణం ఉన్నవారు ప్రజాజీవితంలోకి రావాలి
  • కులాలపేరుతో చీలికలు ప్రజస్వామ్యానికి నష్టం
  • ప్రతిపక్ష హోదా ఒకరిస్తే వచ్చేది కాదు
  • మాట్లాడే విషయంలో వాస్తవం ఉంటే ప్రజలే గుర్తిస్తారు
  • మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

 

నెల్లూరు, మహా :

ప్రజాజీవితంలోకి రావాల్సిన వాళ్లు కష్టపడడం నేర్చుకోవాలని, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. వెంకయ్యనాయుడు గారి 50 సంవత్సరాల రాజకీయ, జీవన ప్రస్థానాన్ని తెలియజేస్తూ సీనియర్ జర్నలిస్టు మాశర్మ రచించిన “వెంకయ్య నాయకుడు” పుస్తకాన్ని నెల్లూరులోని వి.పి.ఆర్. కన్వెన్షన్ సెంటర్ లో ఆదివారం పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘‘రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉంది. అయితే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువత నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. క్రమశిక్షణతో ఉండాలి. సంస్కారవంతమైన రాజకీయాలు చేయండి. ఈ రోజు కొంతమంది కుల, మత, వర్గాల పేరుతో, భాష పేరుతో, జిల్లా పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే కులం పేరుతో పెద్ద వారిని అందులో అనవసరంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. నాయకుల వ్యక్తిత్వం, సమర్థత, ప్రవర్తన తదితర గుణ గణాలను చూసి ఎన్నుకోవాలి. అప్పుడే రాష్ట్ర ప్రతిష్ఠ, దేశ ప్రతిష్ఠ ఇనుమడిస్తాయి.’’ అని స్పష్టం చేశారు. ‘‘నేతలు అన్ని వేదికలపై సంస్కారవంతంగా ఉండాలి. ఏ పార్టీలో ఉన్నా ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. నేను ఈ విషయాన్ని నమ్మి ఆచరించాను. నేను రాజ్యసభ ఛైర్మన్ గా విరమణ చేసినప్పుడు అన్ని పార్టీల సభ్యులు మనస్ఫూర్తిగా మాట్లాడారు. నేను ఘాటుగా విమర్శలు చేసినా ఏనాడూ వ్యక్తిగత దూషణలు చేయలేదు. ప్రతిపక్ష హోదా ఒకరు ఇస్తే రాదు. మా పార్టీకి మేము ముగ్గురు ఎమ్మేల్యేలమే. నేను, జైపాల్ రెడ్డిగారు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే మా సంఖ్యాబలం తక్కువగా ఉన్నా ప్రభుత్వం తలవంచక తప్పని పరిస్థితి ఉండేది. చెప్పే విషయంలో నాణ్యత, వాస్తవం ఉన్నాయా? సమాజాన్ని ప్రతిబింబిస్తోందా అన్నదే ముఖ్యం’’ అని స్పష్టం చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, అభిమానులు ఇచ్చిన విరాళాలు కూడా మిగిలేవని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇప్పడు డబ్బు లేనిదే రాజకీయాలు చేయలేని పరిస్థితి ఉందన్నారు. డబ్బు రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి జబ్బు చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం బలహీనపడుతుందన్నారు. సమాజంలో విలువల పతనం, సంప్రదాయాల పతనం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ తిరిగి విలువలతో కూడిన రాజకీయం, సిద్ధాంతాలతో కూడిన రాజకీయం రావాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తున్న దేశం భారత్ అని, యువతరం దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్ అవతరించాలన్నది ప్రధానమంత్రి లక్ష్యమని, అందుకు అన్ని పార్టీలు సహకరించాలన్నారు. ఉచిత పథకాలు మంచిది కాదని,అనుచితమని స్పష్టం చేశారు. విద్య, వైద్యం మాత్రమే పేదలకు ఉచితంగా ఇవ్వాలన్నారు.

విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని ఉండాలని ఆ రోజుల్లోనే తాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సూచించానని, అమరావతి అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉండే రాజధాని అని అయితే ప్రజలు ఇచ్చిన సమయంలోనే వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వనరులతో వేగంగా పనులు పూర్తి చేసుకుని తర్వాత విస్తరించుకోవచ్చని చెప్పారు.

2004లో వాజ్ పేయి నెల్లూరులోని తమ నివాసానికి వచ్చినప్పుడు తమ కుమార్తె దీపమ్మను రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉందా అని అడిగారని. కానీ దీపమ్మ ఆసక్తి లేదని చెప్పారని గుర్తు చేసుకున్నారు. నాయకురాలివి కావాలనుకోవడం లేదా అని అడిగితే కావాలని ఉందని, అయితే రాజకీయాల్లో ఉంటేనే నాయకులు కానవసరం లేదని చెప్పారన్నారు. మంచి పనులు చేస్తే నాయకులేనన్నది ఆమె అభిప్రాయమని చెప్పారు. పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావాలని చాలా మంది ఒత్తిడి తెచ్చారని, తానుండగా రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను ప్రోత్సహించనని స్పష్టం చేశానని చెప్పారు. తనకు వారసత్వ రాజకీయాలు ఇష్టం లేదని అన్నారు. రాజకీయాల్లో లేకున్నా తమ కుమార్తె దీపమ్మ స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా సేవాకార్యక్రమాలు చేపడుతూ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ముప్పవరపు ఫౌండేషన్ ద్వారా తమ కుటుంబం సేవా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. తనపై అభిమానం చూపించడం సంతోషమేనని, తన అభిమానులు స్వర్ణభారత్ ట్రస్టుపై కూడా అభిమానం చూపించాలని ఆకాంక్షించారు. ‘‘ఆత్మకథ రాయండని చాలా మంది కోరారు. రాస్తే వాస్తవాలు రాయాలి. సమకాలీన నేతలు చాలా మంది గురించి రాయాల్సి వస్తుంది. వారు ఇబ్బంది పడతారు. అందుకే రాయదల్చుకోలేదు. చరిత్రలో చాలా అంశాలు తెలియజేయాలని మిత్రులు చాలా మంది కోరడంతో జీవిత చరిత్ర రాయడానికి అంగీకరించాను.’’ అని వెంకయ్యనాయడు చెప్పారు. మాశర్మ ఈ పుస్తకాన్ని చక్కగా రాశారని చెప్పారు.

 

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పొంగూరు నారాయణ, నెల్లూరు లోక్‌సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు లోక్‌సభ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి మరియు సర్వేపల్లి శాసనసభ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వెంకటగిరి శాసనసభ సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, కోవూరు శాసనసభ సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, గూడూరు శాసనసభ సభ్యులు పాశిం సునీల్ కుమార్, ఉదయగిరి శాసనసభ సభ్యులు కాకర్ల సురేష్, కావలి శాసనసభ సభ్యులు దగుమాటి వెంకట (కావ్య) కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, పుస్తక రచయిత మాశర్మ, స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపావెంకట్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయ అతిథులంతా వెంకయ్యనాయుడుతో తమకు ఉన్న అనుబంధాన్ని, వారి దగ్గర నేర్చుకున్న విషయాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి, నెల్లూరు జిల్లాకు వెంకయ్యనాయుడు చేసిన సేవలను, ఆగమేఘాల మీద తీసుకొచ్చిన ప్రాజెక్టులను గురించి ప్రస్తావిస్తూ తమకు ఇంకా నిరంతరం మార్గదర్శనం చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.

Latest