Mahaa Daily Exclusive

  భారత్‌ లో కాబట్టి లాఠీఛార్జ్ తో సరిపోయింది

Share

  • విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు
  • సీజేపీ ఆందోళనలో పాల్గొన్నది విద్యార్థులు కాదు, దేశ వ్యతిరేక శక్తులు
  • విదేశీ నిధులతో సీజేపీ ఆందోళనలు
  • చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్, మహా : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్ జీ విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థుల చేత ధర్నా చేయించింది విద్రోహ శక్తులు అని, ఉద్యమంలో పాల్గొన్నది నీట్ రాసిన వారు కాదు.. గూండాలు, రొహింగ్యాలు, ఖలీస్తాన్ వాళ్లు కూడా ఉన్నారని ఆరోపించారు. ఇది భారత్ కనుక పోలీసులు కేవలం లాఠీఛార్జ్ మాత్రమే చేసి వదిలేశారని, విదేశాల్లో అయితే ఇలాంటి నిరసనకారులను కాల్చి పడేసేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయ లబ్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాని మోదీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని, అయితే ఈ ఆందోళనల వెనుక విచ్ఛిన్న శక్తులు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన ధర్నాలో విదేశీ ముస్లింలు, క్రిస్టియన్లు, రొహింగ్యాలు, వేర్పాటు వాదులు పాల్గొన్నారని ఆరోపించారు.

తొలిరోజు 50 మంది కూడా రాలేదు

‘ఢిల్లీలో మా ఇల్లు జంతర్ మంతర్‌కు సమీపంలోనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సీజేపీ వారికి ధర్నా చేసేందుకు ఆంక్షలు కూడా విధించలేదు. మూడు వారాల ముందే అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు ధర్నాలో కనీసం 50 మంది కూడా కనిపించలేదు. దాంతో వాళ్లు ఫోన్స్ చేసి ఖలీస్తాని వేర్పాటువాదులు, కాశ్మీర్ వాళ్లను పిలిపించారు. ఢిల్లీలో జేఎన్‌యూకు ఫోన్ చేసి విద్యార్థులను రావాలని పదే పదే అడిగారు. ఆ తరువాత అతికష్టమ్మీద 700 మంది విద్యార్థులు కనిపించారు. కానీ సోషల్ మీడియాలో 2 కోట్ల మంది ఫాలోయర్లు ఉంటే పది లక్షల మంది అయినా ఉద్యమంలో పాల్గొనాలి కదా. లేకపోతే కనీసం లక్ష మంది అయినా రావాలి. అలాంటివి ధర్నాలో కనిపించలేదు. సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన లేహ్ లఢఖ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఆయనతో పాటు జమ్మూకాశ్మీర్ ముస్లింలు, రోహింగ్యాలు, ఖలీస్తాన్ వేర్పాటువాదులు సహా పలు విదేశీ శక్తులు ఉద్యమంలోకి ప్రవేశించాయి. సినిమా స్టార్స్, తుకుడే తుకుడే గ్యాంగ్ ఆధ్వర్యంలోనే ఉద్యమం సాగింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా, ఆమ్ ఆద్మీ పార్టీలు, టీఎంసీ మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, డీఎంకే, రాహుల్ గాంధీలు ఈ ఉద్యమంలో చేరారు. ఈ ఉద్యమంలో ధనవంతులు పాల్గొంటే కూడా విదేశాల నుంచి నిధులు వచ్చాయి` అన్నారు.

జంతర్ మంతర్ వద్ద నిరసనలు హింసాత్మకంగా మారడంతోనే పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని సమర్థించారు. మన దేశంలో కనుక కేవలం లాఠీఛార్జ్ మాత్రమే చేశారని.. అమెరికా లాంటి దేశాల్లో అయితే కాల్చి పారేసే వారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వైపు దూసుకెళ్తే పోలీసులు మాత్రం ఏం చేస్తారు ? శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ పోలీసులను ఛాలెంజ్ చేసేలా అల్లరిమూకలు ప్రవర్తించాయన్నారు. కేంద్రం అనుమతి ఇచ్చిన తరువాత అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నించారని, ఈ ఉద్యమం విదేశీ నిధులతో నడిచిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థులను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించిన కాంగ్రెస్ నాయకులతో పాటు, విదేశాల నుంచి ఫండింగ్ తో జరుగుతున్న ఆందోలకు మద్దతు తెలిపిన ఇతర రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.