- విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, ట్రూడౌన్ చేశాం: మంత్రి గొట్టిపాటి
- అస్తవ్యస్తమైన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టాం
విజయవాడ, మహా :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన విద్యుత్ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మంగళవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ‘ట్రూ డౌన్’ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. విద్యుత్ శాఖలో సాధించిన ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో వ్యవస్థలను చక్కదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాం. జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలూ సర్వనాశనం అయ్యాయి. మేము వాటిని బాగుచేస్తున్నాం” అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం సూర్య ఘర్’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వినియోగించుకుని, సౌర విద్యుత్ ద్వారా లక్షలాది కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కొత్త సబ్స్టేషన్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నామని గొట్టిపాటి తెలిపారు. రైతులకు పెద్ద ఎత్తున వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అన్నారు.
‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసి, గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే, తాము చేస్తున్న పనులను వారి దృష్టికి తీసుకెళుతున్నామని గొట్టిపాటి రవికుమార్ వివరించారు.







