Mahaa Daily Exclusive

  ఆందోళనల మధ్యే శాసన దూకుడు..! ఇప్పటివరకు 19 బిల్లులు ఆమోదించిన ఉభయ సభలు..

Share

• 36 నిమిషాల్లో ఏడు బిల్లులకు ఆమోదం.
• ఇప్పటివరకు 19 బిల్లులు ఆమోదించిన ఉభయ సభలు.
ఢిల్లీ, మహా:
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన శాసన కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. సమావేశాలు ముగియడానికి ఇంకా రెండు రోజులు ఉండగానే ఇప్పటివరకు ఉభయ సభల్లో 19 బిల్లులు ఆమోదం పొందాయి. ఇందులో ఒక దశలో కేవలం 36 నిమిషాల్లోనే ఏడు బిల్లులు ఆమోదం పొందడం చర్చనీయాంశంగా మారింది. అంటే సగటున దాదాపు ఐదు నిమిషాలకు ఒక బిల్లు చొప్పున ఆమోదించిన పరిస్థితి నెలకొంది.

కొన్ని బిల్లులపై సభ్యులు సవరణలు ప్రతిపాదించడంతో వాటి పరిశీలనకు కొంత సమయం పట్టినప్పటికీ.. మొత్తంగా ప్రతిపక్షాల నిరసనలు, సభలో గందరగోళం మధ్యే ప్రభుత్వం తన శాసన కార్యక్రమాన్ని కొనసాగించింది. దీంతో బిల్లుల ఆమోద వేగం, వాటిపై జరిగిన చర్చకు కేటాయించిన సమయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

15 రోజుల సమావేశాల్లో.. 19 బిల్లులు

వర్షాకాల సమావేశాలు మొత్తం 15 రోజుల పాటు కొనసాగుతున్నాయి. రోజుకు సగటున ఆరు గంటల చొప్పున సభలు పనిచేస్తే సుమారు 90 గంటల కార్యకలాపాలు జరగాల్సి ఉంటుంది. అయితే వాస్తవంగా లోక్‌సభ, రాజ్యసభలు పనిచేసిన సమయం దీనికంటే చాలా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు లోక్‌సభ కేవలం 15 గంటల 36 నిమిషాల పాటు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాజ్యసభ మాత్రం 24 గంటల 21 నిమిషాల పాటు కార్యకలాపాలు కొనసాగించింది. సభల్లో నిరంతర ఆందోళనలు, నినాదాలు, వాయిదాల కారణంగా సాధారణ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఒక్కసారి కూడా సజావుగా సాగని ప్రశ్నోత్తరాల సమయం

ఈ సమావేశాల్లో అత్యంత ప్రభావితమైన అంశం ప్రశ్నోత్తరాల సమయమే. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా ప్రశ్నోత్తరాల సమయం పూర్తిస్థాయిలో సజావుగా కొనసాగలేదని గణాంకాలు సూచిస్తున్నాయి.

ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించే అవకాశం సభ్యులకు ఉంటుంది. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన విధానాలు, పథకాలు, ప్రభుత్వ నిర్ణయాలపై ఎంపీలు ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్రతిపక్షాల నిరసనలు, సభలో గందరగోళం కారణంగా ఈ కీలక సమయం పదేపదే దెబ్బతింది.

చర్చకు నోచుకోని కీలక బిల్లులు

ఒకవైపు ప్రభుత్వం బిల్లులను వేగంగా ఆమోదింపజేసుకుంటుండగా.. మరోవైపు కొన్ని కీలక, వివాదాస్పద ప్రతిపాదనలు ఇంకా ముందుకు సాగలేదు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలకు సంబంధించిన బిల్లులపై ఇప్పటివరకు స్పష్టమైన ముందడుగు పడలేదు.

విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ విషయంలో ప్రభుత్వం ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆ బిల్లుపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

చర్చ లేకుండానే ఆమోదమా?

వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన 19 బిల్లుల్లో అనేకం విస్తృతమైన చర్చ లేకుండానే ఆమోదం పొందాయన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, కీలకమైన బిల్లులను తగినంత చర్చ లేకుండా ఆమోదిస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు సభలో నిరసనల కారణంగా సాధారణ శాసన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతోందని అధికార పక్షం వాదిస్తోంది. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై చట్టాలు చేయాల్సిన బాధ్యత పార్లమెంట్‌పై ఉందని, ప్రతిపక్షాలు చర్చకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.

ఆందోళనలు ఒకవైపు.. శాసన ప్రక్రియ మరోవైపు

ప్రతిపక్షాల ఆందోళనలతో సభా కార్యకలాపాలు గణనీయంగా దెబ్బతిన్నప్పటికీ ప్రభుత్వం బిల్లుల ఆమోదాన్ని కొనసాగించడం ఈ సమావేశాల ప్రత్యేకతగా నిలిచింది. ఒకవైపు ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగకపోవడం, సభా సమయం భారీగా వృథా కావడం.. మరోవైపు తక్కువ వ్యవధిలోనే బిల్లులు ఆమోదం పొందడం పార్లమెంటరీ పనితీరుపై కొత్త చర్చకు తెరతీసింది.

Latest