- భారత్-ఇటలీ బంధంపై కేంద్రం స్పష్టత.
- ‘రెండు దేశాల సంబంధాల్లో పరస్పర గౌరవం, అవగాహన కీలకం’.
- రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి.
ఢిల్లీ, మహా.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారత్కు ఇటలీతో బలమైన, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని పేర్కొంది. అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించేటప్పుడు పరస్పర గౌరవం, అవగాహనను పాటించడం ముఖ్యమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
ఈ వివాదానికి కారణం ఢిల్లీలో గురువారం జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో చోటుచేసుకున్న పరిణామం. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. విదేశీ నేతలను కలిసినప్పుడు ప్రధాని మోదీ కౌగిలింతలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. విదేశాంగ విధానం అంటే కేవలం విదేశీ నేతలను కౌగిలించుకోవడం కాదని వ్యాఖ్యానిస్తూ, అక్కడే కాంగ్రెస్ సీనియర్ నేత సందీప్ దీక్షిత్ను సరదాగా కౌగిలించుకున్నారు. ఆ సందర్భంలో దీక్షిత్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును ప్రస్తావించడంతో సభలో నవ్వులు పూశాయి. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా రాజకీయ వివాదం ముదిరింది.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ప్రధాని మోదీ విదేశాంగ విధానాన్ని విమర్శించే క్రమంలో ఇటలీ ప్రధాని పేరును ప్రస్తావించడం, ఆమెను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకత్వం బాధ్యత వహించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత స్థాయికి తగని భాషను ఉపయోగించారని, అంతర్జాతీయంగా భారత్కు స్నేహపూర్వకంగా ఉన్న దేశాధినేతలను దేశీయ రాజకీయ విమర్శల్లోకి లాగడం సరికాదని విమర్శించారు.
ఇటలీతో భారత్ బంధం బలోపేతం
ఈ వివాదం మధ్య కేంద్రం భారత్-ఇటలీ సంబంధాల ప్రాధాన్యాన్ని మరోసారి స్పష్టం చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. విదేశాంగ శాఖ అధికారికంగా పేర్కొన్న వివరాల ప్రకారం.. భారత్, ఇటలీ మధ్య సంబంధాలు ఇటీవలి సంవత్సరాల్లో మరింత విస్తరించి, బలోపేతమయ్యాయి. ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, అంతరిక్షం, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఉగ్రవాద వ్యతిరేక సహకారం వంటి పలు అంశాల్లో కలిసి పనిచేస్తున్నాయి.
భారత్-ఇటలీ సంబంధాలకు వ్యూహాత్మక ప్రాధాన్యం కూడా పెరుగుతోంది. ఇటలీతో ద్వైపాక్షిక సహకారంతో పాటు యూరోపియన్ యూనియన్, జీ7 వంటి వేదికల్లోనూ భారత్ సమన్వయానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇటలీ జీ7 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో భారత్ పలు సమావేశాల్లో పాల్గొంది. 2024లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటలీలో జరిగిన జీ7 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడంతోపాటు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీతో భేటీ అయ్యారు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం కూడా భారత్కు ఇటలీ మద్దతు తెలిపింది. ప్రధాని మోదీతో ఇటలీ ప్రధాని మెలోనీ సంప్రదింపులు జరిపి ఉగ్రవాదంపై పోరాటంలో సహకారాన్ని పునరుద్ఘాటించినట్లు భారత ప్రభుత్వ అధికారిక పత్రాలు పేర్కొంటున్నాయి. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ పరస్పర సంప్రదింపులు కీలకంగా మారాయి.
‘కౌగిలింతల దౌత్యం’పై రాజకీయ పోరు
ప్రధాని మోదీ విదేశీ నేతలతో వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ప్రదర్శించే విధానాన్ని రాహుల్ గాంధీ గతంలోనూ విమర్శించిన సందర్భాలున్నాయి. ఈసారి మాత్రం కాంగ్రెస్ కార్యక్రమంలో అదే అంశాన్ని ప్రదర్శనాత్మకంగా చూపించడం, దానికి సందీప్ దీక్షిత్ మెలోనీ పేరును జోడించడం వివాదానికి కారణమైంది. కాంగ్రెస్ నేతలు దీనిని మోదీ విదేశాంగ విధానంపై రాజకీయ వ్యంగ్యంగా చూస్తుండగా, బీజేపీ మాత్రం ఇది విదేశీ దేశాధినేతను అవమానించే స్థాయికి వెళ్లిందని ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల ప్రాధాన్యాన్ని గుర్తుచేయడం గమనార్హం. రాజకీయ పార్టీల మధ్య దేశీయ అంశాలపై తీవ్ర విమర్శలు, ప్రత్యారోపణలు సాధారణమే అయినప్పటికీ, విదేశీ దేశాధినేతల ప్రస్తావన వచ్చినప్పుడు దౌత్యపరమైన సున్నితత్వాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్న సందేశాన్ని కేంద్రం తాజా ప్రకటన ద్వారా ఇచ్చింది.
దీంతో ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ విమర్శలు, జార్జియా మెలోనీ ప్రస్తావన, భారత్-ఇటలీ సంబంధాలపై కేంద్రం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి. ఒకవైపు రాహుల్ గాంధీ మోదీ విదేశాంగ విధానాన్ని ప్రశ్నిస్తుండగా.. మరోవైపు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ సంబంధాలను దేశీయ రాజకీయ వ్యంగ్యానికి వేదికగా మార్చవద్దని స్పష్టం చేస్తున్నాయి.







