Mahaa Daily Exclusive

  అబద్దాల్లో కాంగ్రెస్ కు ‘ఆస్కార్’ ఇవ్వొచ్చు..

Share

  • అంబేద్కర్ ను అవమానించిన పార్టీ కాంగ్రెస్సే
  • అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ
  • దేశ ప్రజల స్పూర్తి ప్రదాత వాజ్ పేయి
  • సిద్దాంతానికి, నైతిక విలువలకు కట్టుబడి ప్రధాని పదవినే త్యజించిన మహనీయుడు
  • వాజ్ పేయి ఆశయాలను తూ.చ తప్పకుండా అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వం
  • కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు
  • వాజ్ పేయి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కేంద్ర మంత్రి
  • కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సంజయ్

 

హైదరాబాద్, మహా : బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని నేడు ఆయనపై మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అబద్దాలను ప్రచారం చేయడంలో కాంగ్రెస్ గోబెల్స్ ను మించి పోయిందని, అబద్దాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సి వస్తే అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. నేడు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ హయాంలో భారతరత్న అవార్డు అంబేద్కర్ కు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. 1954 నుండి 1988 వరకు నెహ్రూ, ఇందిరా, కామరాజ్ సహా 21 మందికి భారతరత్న అవార్డులను ప్రకటించారు. కానీ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కు మాత్రం ఇవ్వలేదు. ఆయన ఎందులో తక్కువ. ఆయన చేసిన తప్పేంది? అని ప్రశ్నించారు. ఈరోజు వాజ్ పేయి జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ తదితరులతో కలిసి మాజీ ప్రధాని వాజ్ పేయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారితో కలిసి బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. దేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన నేత వాజ్ పేయి దేశ ప్రజలకు స్పూర్తి ప్రదాత అని కొనియాడారు. ప్రోక్రాన్ అణుపరీక్షలు, స్వర్ణ చతుర్భుజీ, గ్రామీణ సడక్ యోజన వారి చలువేనని, పార్లమెంట్ లో బలనిరూపణ విషయంలో అనేక మంది ఇతర పార్టీలో ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, నీతి, నిజాయితీగా వ్యవహరించి పదవిని కోల్పోయిన మహనీయుడు వాజ్ పేయి అని గుర్తు చేశారు.

 

అంబేద్కర్ స్పూర్తితో వాజ్ పేయి నడిచారని, వాజ్ పేయి అడుగుజాడల్లో ఆయన ఆశయాలను తూ.చ తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్రమోడీ అని పేర్కొన్నారు. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నాయకుడన్నారు. నాడు కేసీఆర్, నేడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు 70 ఎంఎం సినిమాలు, గ్రాఫిక్స్ చూపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయడం లేదని మండిపడ్డారు. అంబేద్కర్ విషయంలో అబద్దాలను ప్రచారం చేస్తున్నారంటూ అబద్దాలను ప్రచారం చేయడంలో ఆస్కార్ ను మించి అవార్డు ఇవ్వాల్సి వస్తే అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించి కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. రెండు సార్లు లోక్ సభ ఎన్నికల్లో అంబేద్కర్ ను ఓడించేందుకు స్వయంగా నెహ్రూ ప్రచారం చేశారని, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించని దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విరుచుకుపడ్డారు. అంబేద్కర్ ఆశయాలను తూ.చ తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ బీజేపీ. అంబేద్కర్ పంచ్ తీర్థ్ ను ఏర్పాటు చేసి ఆయన ఖ్యాతిని దశదిశలా చాటి చెబుతున్న పార్టీ బీజేపీ. వారికి భారత రత్న అవార్డు ఇచ్చి గౌరవించిన పార్టీ బీజేపీ. అని వివరించారు.

Latest