Mahaa Daily Exclusive

  తెలంగాణ క్లీన్​ అండ్​ గ్రీన్​ ఎనర్జీ పాలసీ 2025..!

Share

తెలంగాణ క్లీన్​ అండ్​ గ్రీన్​ ఎనర్జీ పాలసీ 2025
పదేండ్లలో 20 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు
పర్యావరణ హితం, సమ్మిళిత అభివృద్ధి ప్రభుత్వ సంకల్పం
గ్రీన్​ ఎనర్జీకి భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు

హైదరాబాద్, మహా: గ్రీన్‌ ఎనర్జీ ఉత్పాదకతను పెంచి భవిష్యత్తు అవసరాలకు సరిపడే విద్యుత్తును సమకూర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ–2025’ని రూపొందించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ కొత్త పాలసీని ఆమోదించింది. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం అదనంగా సమకూర్చుకోవాలనేది ఈ కొత్త పాలసీ లక్ష్యం. రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి కొత్త విధానం సరికొత్త బాటలు వేస్తుంది. కొత్త గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ పాలసీతో రాబోయే పదేండ్లలో 1.98 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు 1.14 లక్షల ఉద్యోగ అవకాశాల సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడున్న కాలుష్య కారక తీవ్రత పదేండ్లలో 33 శాతం తగ్గుతుందని కూడా అంచనా వేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీ, ఫార్మాసిటీ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, పారిశ్రామిక కారిడార్ తదితర అభివృద్ధి పనులతో భవిష్యత్తులో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరగనుంది. 2024–25లో రాష్ట్రంలో 15,623 మెగావాట్ల గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ ఉండగా, 2034–35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం పెంచుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. సౌర విద్యుత్‌ తో పాటు ఫ్లోటింగ్‌ సోలార్, విండ్ పవర్, గ్రీన్‌ హైడ్రోజన్, హైబ్రిడ్‌ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ఈ విధానం రూపొందించింది. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులతో పాటు సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలను ఈ పాలసీలో పొందుపరిచింది. మన రాష్ట్రంలో ఉన్న వాతావరణం ఏడాదిలో 300 రోజులు సౌర విద్యుత్తు ఉత్పత్తికి అనుకూలిస్తుంది. దేశంలోనే బలమైన గాలులు వీచే 8 రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో పవన విద్యుత్తు ఉత్పత్తికి మెండుగా అవకాశాలున్నాయి. కొత్త విధానం ప్రకారం సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లు, పవన విద్యుత్‌ కేంద్రాలను స్థాపించేందుకు ముందుకు వచ్చే డెవెలపర్లను ప్రోత్సహించనున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ స్థలాల్లో కొత్త ప్లాంట్లకు అనుమతులిస్తారు. వీటికి ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు అద్దెతో లీజుకు ప్రభుత్వం ఇవ్వనుంది. రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న వారు డిస్కంలకు లేదా ప్రైవేటు సంస్థలకు ఓపెన్‌ యాక్సెస్‌ ద్వారా అమ్ముకునే అవకాశాన్ని కల్పించనున్నారు. అదేవిధంగా కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ద్వారా జలాశయాలపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ఈ పాలసీ కింద ప్రభుత్వం ప్రోత్సహించనుంది. ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు జలాశయాలను నామినేషన్‌ విధానంలో కేటాయించనున్నారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు సౌర విద్యుత్‌ ప్లాంట్లు నెలకొల్పేందుకు ప్రోత్సహిస్తుంది. 500 కిలోవాట్‌ నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశమిస్తుంది. డిస్కంలు ఈ విద్యుత్‌ను కొనుగోలు చేస్తాయి. ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై రూఫ్‌టాప్‌ సౌరవిద్యుత్‌ ప్లాంట్లను ప్రోత్సహిస్తారు. సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ, ఇతర పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే స్థలాలను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. సీలింగ్ పరిమితి ఉండదు. భూ వినియోగ మార్పిడి అనుమతులు అవసరం ఉండదు. టీజీ-ఐపాస్‌ ద్వారా అని రకాల అనుమతులను ప్రభుత్వం వేగంగా జారీ చేస్తుంది. ప్లాంట్ల స్థాపనకు కొనుగోలు చేసిన భూములకు 100 శాతం స్టాంప్ డ్యూటీని రీయింబర్స్ చేస్తారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతులు, ఎన్వోసీలను మినహాయించారు. సోలార్ ప్లాంట్లకు నీటి ఛార్జీలను రియింబర్స్ చేస్తారు. సోలార్, పవన విద్యుత్తును వినియోగించే ఎంఎస్ఎంఈ సంస్థలకు 8 ఏండ్ల పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మాఫీ వర్తిస్తుంది. మూల ధన పెట్టుబడిలోనూ రాష్ట్ర జీఎస్టీ వాటాను తిరిగి చెల్లిస్తారు. పునరుత్పాదక విద్యుత్తులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, వినూత్న ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ కో లేదా డిస్కంల అధ్వర్యంలో ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు

Latest