కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. సంక్రాంతి హాలీడేస్ తర్వాత మంగళవారం నుంచి కమిషన్ విచారణను పున : ప్రారంభించింది. మంగళవారం ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు రామకృష్ణారావును కమిషన్ విచారించింది. దాదాపు 24 ప్రశ్నలను రామకృష్ణను కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ అడిగారు. రామకృష్ణారావు సమర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా ఆయన ముందు ప్రశ్నలు ఉంచారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, లోన్స్, ప్రాజెక్టు డిజైనులు, బడ్జెట్ కేటాయింపు, వడ్డీల చెల్లింపులపై వంటి కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్కు నిధులు ఎలా సమకూరాయని కమిషన్ అడుగగా, బడ్జెట్ కేటాయింపులు, రుణాల ద్వారా నిధులు సమకూర్చినట్లు రామకృష్ణారావు చెప్పారు. కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారన్న కమిషన్ ప్రశ్నకు పరిశ్రమలకు, ఇతర అవసరాలకు నీళ్లు అమ్మి రెవెన్యూ జనరేట్ చేయడమే ప్రాజెక్ట్ లక్ష్యమని రామకృష్ణారావు చెప్పినట్లు సమాచారం. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని కమిషన్ ప్రశ్నించగా, ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. డిజైన్లను అప్రూవల్ చేసే సమయంలో నిబంధనలు పాటించలేదని కమిషన్ ప్రశ్నించగా ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీతో ఎప్పుడూ సమావేశం కాలేదని, కమిటీ రికార్డులు లేవని కమిషన్ ముందు రామకృష్ణారావు చెప్పారు.
ప్రాజెక్ట్ తొందరగా కట్టారు కానీ నిబంధనలు పాటించలేదని కమిషన్ అడిగింది. అలాగే అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు పాలసీలను పెట్టారా అని కమిషన్ ప్రశ్నించగా దానికి రామకృష్ణారావు తెలియదని సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ ప్రాపర్గా కేబినెట్ ముందుకు రాలేదని, నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని కమిషన్ ప్రశ్నించింది. నిబంధనలు పాటించకుండా విడుదల చేసిన నిధుల రికార్డులను రామకృష్ణారావుకు కమిషన్ చూపించింది. ఆర్థిక పరమైన అంశాల్లో రికార్డులను సరిగా మెయింటెయిన్ చేయలేదని కమిషన్ ప్రశ్నించగా.. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గ్యారెంటీతోనే కార్పొరేషన్ లోన్స్ తీసుకుందని రామకృష్ణ తెలిపారు. 2024- 25 ఫైనాన్షియల్ ఇయర్ లో రూ. 7382 కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్కు రూ. 6519 కోట్ల వడ్డీ చెల్లించామని ఆయన వెల్లడించారు. 9 నుంచి 10.5 శాతం వడ్డీ చెల్లిస్తున్నామని కమిషన్కు రామకృష్ణా రావు తెలిపారు.
ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులు, ఇంజనీర్లతో అఫిడవిట్లను గతంలోనే కమిషన్ తీసుకుంది. ఆ అఫిడవిట్లను ముందు పెట్టుకునే కమిషన్ బహిరంగ విచారణ చేస్తోంది. గత జూలైలోనే విచారణకు రావాల్సిందిగా రామకృష్ణారావుకు కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే అప్పట్లో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆ ప్రిపరేషన్లో ఉన్నందున విచారణకు రాలేనని రామకృష్ణ చెప్పగా కమిషన్ మినహాయింపు ఇచ్చింది. తిరిగి ఈరోజు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు కమిషన్ ఎదుట రామకృష్ణారావు హాజరయ్యారు. 2 గంటలకు ప్రారంభమైన విచారణ 3:45 గంటలకు ముగిసింది.







