దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సీన్ కనిపించింది. సాధారణంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి తమ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేయాలని, ప్రాజెక్టులు కేటాయించాలని ముఖ్యమంత్రులు ప్రధానికి విజ్ఞప్తులు చేస్తుంటారు. ఇది సర్వ సాధారణంగా జరిగేది. అయితే, ఈసారి ఢిల్లీలో అందుకు భిన్నంగా జరిగింది. హస్తినలో కొత్త సీన్ కనిపించింది. ప్రధాని మోదీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి, త్వరగా కంప్లీట్ చేయాలంటూ ఏకంగా ప్రధాని మోదీయే ఆ ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అంశాలపై నివేదిక ఇచ్చారు ప్రధాని మోదీ. 2017 నుంచి 2022 వరకు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉంటూ వస్తున్న అంశాలపై దృష్టి పెట్టాలని వాటిని పరిష్కరించాలని రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ సూచించారు.
పీఎంఏవై గ్రామీణ పథకం అమలు కావడం లేదు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం 2016-17 నుంచి తెలంగాణలో అమలు కావడం లేదని నివేదికలో పొందుపరిచారు. ఆవాస్ 2018 మొబైల్ అప్లికేషన్ ద్వారా 2025 మార్చ్ 31 నాటికల్లా సర్వే కంప్లీట్ చేయాలని, అర్హులను గుర్తించాలని ముఖ్యమంత్రికి ప్రధాని మోడీ తెలిపారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మూడు మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రోడ్ల నిర్మాణం అటవీ పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ప్రధాని కోరారు.
పెండింగ్ లో మూడు నీటి పారుదల ప్రాజెక్టులు
మూడు నీటి పారుదల ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని, వాటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, రివైజ్ ఎస్టిమేట్స్ పంపించాలని రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి సూచించారు. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 కింద 18,189.53 కోట్ల విలువైన పనులకు అనుమతులు పెండింగ్ లో ఉన్నాయని సీఎంకు పీఎం తెలిపారు.
బీబీనగర్ ఎయిమ్స్ కి 1365.95 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ కనెక్షన్ వాటర్ సప్లయ్ కోసం పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించాలని ప్రధాని సూచించారు. శంషాబాద్ లో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వ భూమికి పెండింగ్ లో ఉన్న 150 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని సీఎంకి సూచించారు. రెండు రైల్వే ప్రాజెక్టులు మనోహరాబాద్ కొత్తపల్లి నూతన రైల్వే లైన్, కాజీపేట విజయవాడ మూడో లైన్ విద్యుదీకరణకి సంబంధించి 3113.48 కోట్ల రూపాయలు 2020 సంవత్సరం నుంచి భూసేకరణ అటవీ అనుమతులు పెండింగ్ లో ఉన్నాయని త్వరగా క్లియర్ చేయాలని సీఎంకి సూచించారు. ప్రధాని సూచించిన పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో సమీక్ష జరిపి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.








