ఖమ్మం, మే 1, మహా.
దేశవ్యాప్తంగా కులగణన చర్చ సాగుతున్న తరుణంలో, బీజేపీ ఖమ్మం జిల్లా నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కులగణన అనేది సామాజిక న్యాయానికి బీజం వేయగలిగే చారిత్రక ప్రక్రియ అని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు.
ఖమ్మం జడ్పీ కార్యాలయంలో బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, బీసీ వర్గాల సంక్షేమానికి మోదీ తీసుకుంటున్న చొరవను కొనియాడారు.
ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ, “బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇది బడుగు, బలహీన వర్గాలకి న్యాయం జరిగే దిశగా ఒక కీలక అడుగు. బీసీల శాస్త్రీయ గణాంకాలు లేకపోవడం వల్ల అనేక సంక్షేమ పథకాల అమలులో వారికి నష్టమవుతోంది. కులగణన వచ్చి, ఈ లోటు తొలగిపోతుంది,” అని పేర్కొన్నారు.
కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలు:
కులగణనను తమ ఘనతగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని, కానీ వారే గత యూపీఏ పాలనలో దీన్ని ఎందుకు చేపట్టలేకపోయారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. “కేవలం ఓట్లు దక్కించుకోవడానికే ముస్లింలను బీసీలుగా చేర్చే కుట్రలకు కాంగ్రెస్ పాల్పడుతోంది. బీసీల హక్కుల కోసం నిజంగా పోరాడేది బీజేపీ మాత్రమే,” అని విమర్శించారు.
నినాదాలతో మార్మోగిన వేదిక:
ఈ కార్యక్రమంలో “మోడీ జిందాబాద్”, “కులగణన వర్ధిల్లాలి”, “బీసీలకు న్యాయం జరగాలి” వంటి నినాదాలతో వేదిక మార్మోగింది. నేతలు మోదీ పాలనను ప్రశంసిస్తూ, బీజేపీనే బీసీల కోసం పనిచేస్తున్న పార్టీ అని చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవీ.రమేష్, శీలం పాపారావు, జ్వాల నరసింహారావు, అల్లిక అంజయ్య, శ్యాం రాథోడ్, మందడపు సరస్వతి, రుధ్ర ప్రదీప్, పమ్మి అనిత, రీగన ప్రతాప్, వీరెల్లి రాజేష్ గౌడ్, మందడపు సుబ్బారావు, మేకల నాగేందర్, వివిధ మండలాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.








