భద్రాద్రి కొత్తగూడెం, మే 7 (మహా): కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడంలో స్థానిక శాసనసభ్యులు పూర్తిగా విఫలమయ్యారని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ విమర్శించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పట్టణంలోని మున్సిపల్ పరిధిలో గత వారం రోజులుగా కిన్నెరసాని మంచినీరు రాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా పాలకులకు పట్టింపు లేదని అధికారులకు సమస్య పరిష్కరించాలనే ఆలోచన చేయకపోవడం చాలా దౌర్భాగ్యం అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని,మంచి నీటి సమస్యను పరిష్కరిస్తామని గొప్పలు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని, నెల, రెండు నెలలకు ఒకసారి రోజుల తరబడి కిన్నెరసాని మంచినీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేకపోవడం చాలా దౌర్భాగ్యకరమన్నారు. పట్టణంలో సరఫరా అవుతున్న కిన్నెరసాని మంచినీరుతో పాటు సింగరేణి సంస్థ ద్వారా బస్తీల్లో వీధి కుళాయిలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.జిల్లా అధికారులు తక్షణమే స్పందించి స్వచ్ఛమైన మంచినీటిని నిర్దిష్ట సమయంలో ప్రతీ రోజు అందించాలని డిమాండ్ చేశారు.







