ఖమ్మం – మహా.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే దేశ జీడీపీలో 2శాతం మేర ఖర్చు తగ్గుతుందని, తద్వారా దేశ ప్రజల సంక్షేమానికి, ఆకలి తీర్చడానికి అవకాశం దక్కుతుందని మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్రావు అన్నారు. ఖమ్మం జిల్లాలోని హోటల్ కోణార్క్లో వన్ నేషన్`వన్ ఎలక్షన్ అనే అంశంపై భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఆద్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు రఘునందన్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదమని, ఒకేసారి ఎన్నికలు జరిగే ప్రభుత్వం కూలిపోతే ఎలా అని కొందరు.. గెలిచిన వారు చనిపోతే ఎలా అని మరికొందరు ప్రశ్నిస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు తప్ప అందులో వాస్తవం ఎంత అనేది ప్రజలు గుర్తించాలని కోరారు. నియంతృత్వ శైలితో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ అహింసను ప్రేరేపిస్తూ పబ్బం గడుపుతుందని, లెఫ్ట్ పార్టీలకు దేశ ప్రజలు ఇప్పటికే మంగళం పాడారని, తెలంగాణ వ్యాప్తంగా ఒక సీటుకి పరిమితం చేసి కమ్యూనిస్టులను లెఫ్ట్ చేశారని ఎద్దేవా చేశారు. ఇక రైట్వేలో ముందుకు పోతున్నది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమేనని, రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా బిజెపి జెండా రెపరెపలాడటం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక మొన్న జరిగిన ఆపరేషన్ సిందూర్తో పాటు భారత ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్నామని ప్రగల్భాలు పలికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని మదర్సాల్లో తలదాచుకున్న పాక్ మద్ధతుదారులను, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుండి అక్రమంగా తెలంగాణలో నివసిస్తున్న వారిని రాష్ట్ర పొలిమేరలు దాటించినప్పుడు మాత్రమే దేశానికి మద్ధతు ఇచ్చినవారవుతారని పేర్కొన్నారు. దేశంలో ఉగ్రవాదం పెల్లుబుకుతోందని, అహింసో పరమో ధర్మ అనే నినాదాన్ని ఒంటపట్టించుకున్న దేశ ప్రభుత్వం పొరుగు దేశాలు హింసకు ప్రేరేపిస్తే చూస్తూ ఊర్కోబోవని, మొన్న జరిగిన ఆపరేషన్ సిందూర్ అందుకు నిదర్శనమన్నారు. పహల్గాంలో పురుషుల బట్టలు తొలగించి నిర్దారించుకొని మరీ మారణ హోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులు, మహిళల సిందూరాన్ని తుడిచామని సంతోషించారని, దానికి ప్రతీకారంగా ఇద్దరు మహిళా అధికారుల నేతృత్వంలో ఆపరేషన్ సిందూర్ను ద్వారా 9 ఉగ్రవాద స్థావరాలపై తిరుగుబావుట ఎగురవేసి దేశ సత్తా చాటిన ఆర్మీకి అభినందనలు తెలిపారు. మీడియా సమావేశంలో నాయకులు దేవకి వాసుదేవరావు, సన్నీ ఉదయ ప్రతాప్, దొంగల సత్యనారాయణ, పుల్లారావు యాదవ్, తక్కెళ్ళపల్లి నరేందర్ రావు, డాక్టర్ శీలం పాపారావు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వరావు, నున్న రవికుమార్, పెరుమాళ్ళపల్లి విజయరాజు, మందా సరస్వతి తదితరులు పాల్గొన్నారు








