Mahaa Daily Exclusive

  కుప్వారాలో కాల్పులు.. సైనికుడు మృతి..!

Share

జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో శనివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక సైనికుడు మరణించగా.. ఆర్మీ మేజర్ సహా నలుగురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. ఈ ఎన్కౌంటర్ లో పాకిస్తాన్ కు చెందిన ఒక వ్యక్తి కూడా చనిపోగా.. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారని తెలిపింది. ఎన్కౌంటర్లో మరణించిన వ్యక్తి ఉగ్రవాదేనన్న విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు.

2021 ఫిబ్రవరిలో ఇండియా – పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు జరిగిన పలు దాడుల్లో పాల్గొన్న పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (BAT) ఇప్పుడు దాడికి పాల్పడినట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి. కార్గిల్ విజయ్ దివస్ రోజున ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చి, ఉగ్రవాద సవాళ్లను భారత సైన్యం ఓడిస్తుందని చెప్పిన మర్నాడే LOC వెంబడి దాడి జరిగింది. అయితే పాకిస్తాన్ చెందిన సైన్యం ఈ దాడికి పాల్పడిందా లేక ఉగ్రవాదుల పనా అన్నదానిపై స్పష్టత లేదని X లో చేసిన పోస్ట్ లో పేర్కొంది.

ఈ వారంలోనే ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. LOCని సందర్శించి.. చొరబాట్లు, ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు బలగాల సంసిస్ధతను సమీక్షించారు. అలాగే గత నెలలో ప్రధాని అధ్యక్షతన ఉగ్రవాద సంఘటనలపై సమీక్ష సమావేశం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ లో సాయిధ బలగాలు చేపడుతున్న ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు.