Mahaa Daily Exclusive

  ఆదిలాబాద్‌లో వర్ష విలయం లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం నిండుకుండ‌లా జ‌లాశ‌యాలు చెరువుల‌ను త‌ల‌పిస్తున్న‌ పంట‌పొలాలు…!

Share

ఆదిలాబాద్ మ‌హా : సోమ‌వారం కూడా శ‌నివారం నాటి ప‌రిస్థితే త‌లెత్తింది. ఏక బిగిన మూడు గంట‌ల‌పాటు కురిసిన భారీ వ‌ర్షానికి జిల్లా కేంద్రం అత‌లాకుత‌మైంది. పట్టణంలో లోత‌ట్టు కాలనీలన్నీ జలమయం అయ్యాయి. దోబి కాలనిలో ఇండ్లలోకి భారీగా చేరిన వరదనీరు చేరుకుంది. వరదనీటిలో పర్నిచర్, తిండిగింజలు అన్నీ మునిగిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువులకు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఆహార పదార్థాలు వరద నీటిలో కూరుకుపోవడంతో కొన్ని కాల‌నీల‌లో ఆకలికి అలమటిస్తున్నారు. కొన్నిచోట్ల రహదారులు దెబ్బతినడంతో రాక‌పోక‌లు నిలిచిపోయాయి. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప‌ట్ట‌ణంలోని దుర్గాన‌గ‌ర్ , శాంతిన‌గ‌ర్, సుభాష్ న‌గ‌ర్,మ‌హాల‌క్ష్మివాడ‌,తిర్పెల్లి, జీఎస్ ఎస్టేట్,టీచ‌ర్స్ కాల‌నీ, హ్యాండీక్యాప్డ్ కాల‌నీ, త‌దిత‌ర కాల‌నీలు నీట మునిగాయి. ఇండ్ల‌లోకి నీరుచేరి నిత్యావ‌స‌ర స‌రుకులు త‌డిచిపోయాయని బాధితులు వాపోయారు.ఇళ్ల‌లోకి చేరిన నీటిని బ‌కెట్ల‌తో బ‌య‌ట‌కు పార‌బోసారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప‌త్తి సోయా, కంది పంటలు మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల‌ని కోరుతున్నారు.వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు దాటే ప్రయత్నం చేయకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.