Mahaa Daily Exclusive

  భారత్‌ సహనాన్ని బలహీనతగా భావించొద్దు..! ఆపరేషన్‌ సిందూర్‌పై తొలిసారి అజిత్‌ డోభాల్‌..

Share

• ఎంతటి రిస్క్‌నైనా తీసుకోగలం.
• పర్యవసానాలను లెక్కచేయకుండా దాడులు చేయగలం.
• ఆపరేషన్‌ సిందూర్‌పై తొలిసారి అజిత్‌ డోభాల్‌.

ఢిల్లీ, మహా.
భారత్‌ సహనాన్ని బలహీనతగా భావించి పొరపాటు చేయొద్దని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్‌ స్పష్టం చేశారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఉగ్రవాద చర్యలకు భారత్‌ దీటుగా స్పందించగలదని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై తొలిసారి ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. ఆపరేషన్‌ సిందూర్‌పై డిస్కవరీలో త్వరలో ప్రసారం కానున్న డాక్యుమెంటరీ సిరీస్‌లో డోభాల్‌తోపాటు ఆ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన పలువురు అధికారులు తమ అనుభవాలను పంచుకున్నారు.

ఆపరేషన్‌ సిందూర్‌ లక్ష్యాలను ముందుగానే స్పష్టంగా నిర్దేశించుకున్నామని డోభాల్‌ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్న ఉగ్రవాద మౌలిక వసతులు, స్థావరాలను ధ్వంసం చేయడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించుకున్నామని చెప్పారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడితే భారత్‌ మౌనంగా ఉండదనే స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి ఈ ఆపరేషన్‌ ద్వారా ఇచ్చామని పేర్కొన్నారు.

భారత్‌ సంయమనం పాటిస్తోందని భావించి దాన్ని బలహీనతగా పరిగణించడం పెద్ద పొరపాటవుతుందని డోభాల్‌ హెచ్చరించారు. దేశ ప్రయోజనాలు, భద్రత విషయంలో భారత్‌ ఎంతటి రిస్క్‌నైనా తీసుకోగలదని స్పష్టం చేశారు. అవసరమైతే పర్యవసానాలను లెక్కచేయకుండా నిర్ణయాత్మక దాడులు చేయగల సామర్థ్యం భారత్‌కు ఉందని తెలిపారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులకు ఆపరేషన్‌ సిందూర్‌ ఒక స్పష్టమైన వ్యూహాత్మక సందేశాన్ని పంపిందని వివరించారు.

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ గతేడాది మే 7న ప్రారంభమైంది. పహల్గాం దాడికి కారణమైన ఉగ్రవాద మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ బలగాలు దాడులు నిర్వహించాయి. ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఈ చర్య అనంతరం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం సుమారు 88 గంటలపాటు ఇరుదేశాల మధ్య పరస్పర దాడులు, ప్రతిదాడులు కొనసాగాయి. పరిస్థితులు మరింత తీవ్రతరం కాకుండా మే 10న పాకిస్థాన్‌ కాల్పుల విరమణకు ప్రతిపాదించగా భారత్‌ అందుకు అంగీకరించింది. అయితే, ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా భారత్‌ ఉగ్రవాదంపై తన విధానంలో కీలకమైన మార్పును ప్రపంచానికి చాటిచెప్పిందని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ఆపరేషన్‌కు సంబంధించిన నిర్ణయాలు, వ్యూహాలు, ఎదురైన సవాళ్లపై డోభాల్‌తోపాటు ఆపరేషన్‌లో భాగస్వాములైన పలువురు ఉన్నతాధికారులు డాక్యుమెంటరీలో తమ అనుభవాలను వెల్లడించారు. ఆపరేషన్‌ సిందూర్‌ వెనుక జరిగిన వ్యూహాత్మక కసరత్తు, లక్ష్యాల ఎంపిక, దేశ భద్రతకు సంబంధించిన నిర్ణయాలపై మరిన్ని వివరాలు ఈ డాక్యుమెంటరీలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

‘ఆపరేషన్‌ సిందూర్‌’పై రూపొందించిన ఈ ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ శనివారం రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం కానుంది. డిస్కవరీ+ ఓటీటీ వేదికలోనూ అందుబాటులోకి రానుంది. ఆపరేషన్‌ సిందూర్‌ వెనుక ఉన్న కీలక నిర్ణయాలు, భద్రతా వ్యూహాలు, అధికారుల అనుభవాలు తొలిసారిగా విస్తృతంగా వెల్లడికానుండటంతో ఈ డాక్యుమెంటరీపై ఆసక్తి నెలకొంది.

Latest