Mahaa Daily Exclusive

  మా నోటికాడి అన్నం ముద్ద‌ లాక్కున్నారు.. జీవోపై స్టే విధించ‌డం చాలా దుర‌దృష్ట‌క‌రం..!

Share

  • ఈ నిర్ణ‌యం 56 శాతం బీసీ ప్ర‌జ‌ల హ‌క్కుల‌కు విఘాతం
  • నేటి నుంచి రాస్తారోకోలు, ధ‌ర్నాలు చేసి రాష్టాన్ని స్తంభింప‌జేస్తాం
  • రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణ‌య్య కీలక వ్యాఖ్యలు

 

హైదరాబాద్, మహా: బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టు స్టే విధించ‌డంతో బీసీల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణ‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించ‌క‌పోతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. హైకోర్టు వ‌ద్ద ఆర్ కృష్ణ‌య్య మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను రెండు వారాల పాటు ఆప‌డ‌మ‌నేది దుర‌దృష్ట‌క‌రం. ఎందుకంటే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యాక ఎన్నిక‌ల‌ను ఆపొద్ద‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల‌కు విరుద్ధంగా రెండు వారాల పాటు ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డం తాము తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నాం. ఈ నిర్ణ‌యం రాష్ట్రంలోని 56 శాతం బీసీ ప్ర‌జ‌ల హ‌క్కుల‌కు విఘాతం క‌లిగిస్తుంది. బీసీల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బతీశారు. నోటికాడి అన్నం ముద్ద‌ను లాక్కున్నారు. మొన్న నుంచి విచార‌ణ జ‌రిపిన కోర్టు.. మ‌రో రెండు రోజులు స‌మ‌యం తీసుకుని ఇంకా విస్తృతంగా విచార‌ణ చేప‌ట్టాల్సి ఉండే. ఎందుకు ఆద‌ర‌బాద‌ర‌గా స్టే విధించాల్సి వ‌చ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నాం’ అని ఆర్ కృష్ణ‌య్య పేర్కొన్నారు.

 

లేక లేక స‌ర్పంచ్ అవ‌కాశం వ‌స్తే..

ప్ర‌భుత్వం స్పంద‌న ఏంటో చూస్తాం. తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చి రాష్టాన్ని స్తంభింప‌జేస్తామ‌ని హెచ్చ‌రించారు. బీసీల్లో ఏంతో చైత‌న్యం వ‌చ్చింది.. ఊరురా స్పంద‌న తెలుపుతాం. సీఎం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో.. సాయంత్రంలోగా ప్ర‌క‌టించాలి. లేదంటే పెద్ద ఎత్తున బంద్ నిర్వ‌హిస్తాం. దేశాన్ని క‌దిలించేలా బంద్ ఉంటుంది. ఏం త‌మాషాగా ఉందా..? బీసీలంటే అంత చుల‌క‌న‌గా ఉందా..? ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు రావు మంత్రి ప‌ద‌వులు రావు.. లేక లేక స‌ర్పంచ్ అవ‌కాశం వ‌స్తే వాటిని కూడా లాగేసుకోవ‌డం స‌రికాదు. ఈ స‌మాజంలో బీసీల స‌త్తా ఏంటో చూపిస్తాం. స్టే విధించ‌డం చాలా దుర‌దృష్ట‌క‌రం. రేప‌ట్నుంచి రాస్తారోకోలు, ధ‌ర్నాలు చేస్తామ‌ని ఆర్ కృష్ణ‌య్య హెచ్చ‌రించారు.

==================