Mahaa Daily Exclusive

  ఏపీ కేబినెట్ భేటీ..!

Share

ఏపీ కేబినెట్ భేటీకి అంతా సిద్దమైంది. కానీ అంతలోనే వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి వార్త తెలిసింది. సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే టాటాకు నివాళులర్పించే కార్యక్రమంను నిర్వహించ తలచారు. అందరు మంత్రులు వచ్చారు. సీఎం చంద్రబాబు హుటాహుటిన కేబినెట్ భేటీ సమావేశ మందిరం వద్దకు చేరుకొని.. టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అలాగే రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే ఈ కార్యక్రమంలో అందరి కళ్లు ఒకరి కోసం వెతకసాగాయి. ఆయనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

 

కూటమి ప్రభుత్వంలో నెంబర్-2 పొజిషన్ లో గల జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడా కనిపించలేదు. కేవలం తన ట్విట్టర్ ద్వారా.. పారిశ్రామిక రంగంలో పాటు సామాజిక సేవా రంగంలో తనదైన ముద్ర వేసిన రతన్ టాటా.. నవతరం పారిశ్రామిక వేత్తలకు ఆదర్శప్రాయుడు. ఆయన అస్తమయం దేశానికి తీరని లోటు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. కానీ కేబినెట్ భేటీ సమావేశ మందిరం వద్ద కనిపించక పోవడంతో అసలు ఏమైంది అంటూ మంత్రుల పేషీలు ఆరా తీశారు.

 

ఇటీవల తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి.. పవన్ 11 రోజులు ప్రాయాశ్చిత్త దీక్ష చేపట్టారు. అలాగే తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో కొంత అలసటకు గురయ్యారు పవన్. అయినా మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకొని.. శ్రీవారి దర్శనం అనంతరం.. మరుసటి రోజు వారాహి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. సుమారు గంటకు పైగానే పవన్ సభలో ప్రసంగించారు.

ఈ పర్యటన ముగించుకొని వచ్చిన పవన్.. కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా మళ్లీ అధికారిక కార్యక్రమాల్లో యధావిధిగా పాల్గొన్నారు. అంతేకాకుండా.. తన పార్టీ కార్యాలయం వద్ద తనను కలిసేందుకు వచ్చిన రాష్ట్ర ప్రజలు, ఉద్యోగ సంఘాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇలా రోజూ బిజిబిజీ కార్యక్రమాలతో పవన్ డైలీ డైరీ కొనసాగుతూ ఉంది. కానీ కేబినెట్ భేటీకి పవన్ గైర్హాజరు కావడంపై ఆరా తీసిన మంత్రులకు అసలు విషయం తెలిసింది.

 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గొంతు నొప్పితో తీవ్రంగా బాధ పడుతున్నారు. రోజువారీ కార్యక్రమాలు అధికం కావడం.. ప్రజలతో ముఖాముఖిగా పవన్ మాట్లాడుతుండగా.. ఈ సమస్య మరింతగా పవన్ ను ఇబ్బంది పెడుతోందట. కొంచెం ఆరోగ్యంగా ఉన్నా.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెనుకడుగు వేయని పవన్.. తీవ్రమైన గొంతు నొప్పితోనే తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని సమాచారం. అయితే పవన్ కు గొంతునొప్పి అంటూ తెలియడంతో.. త్వరగా కోలుకోవాలని జనసైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు కోరుకుంటున్నారు.