ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి కేటాయించినా క్యాట్ ఆదేశాలతో తెలంగాణలోనే కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 16వ తేదీలోపు ఏపీకి కేటాయించినవారు ఏపీలో, తెలంగాణకు కేటాయించినవారు తెలంగాణలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తెలంగాణ నుంచి ఐదుగురు ఐఏఎస్ లు, ముగ్గురు ఐపీఎస్ లు ఏపీకి, ఏపీ నుంచి ముగ్గురు ఐఏఎస్ లు తెలంగాణకు వెళ్లాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న ఆమ్రపాలి గురించే చర్చ ఎక్కువగా జరుగుతోంది.
బీజేపీ పావులు కదిపింది
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలనే వ్యూహాన్ని రచించుకుంటోంది బీజేపీ. తాజాగా ఇచ్చిన ఆదేశాలతో రేవంత్ రెడ్డి సర్కారును ఇబ్బందుల్లోకి నెట్టేందుకు కేంద్రం పావులు కదిపిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిపాలన కుంటుపడితే సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అది తమ పార్టీకి కలిసివస్తుందని బీజేపీ భావనగా ఉంది. పరిపాలన కుంటుపడాలంటే డైనమిక్ గా, నిజాయితీగా, నిక్కచ్చిగా పరిపాలన చేస్తూ ప్రభుత్వానికి మంచిపేరు తెస్తున్న అధికారులను నియంత్రిస్తే సరిపోతుందని ఆ పార్టీ నేతలు యోచించారు. అందుకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉపయోగించుకొని బదిలీలు చేశారనే విశ్లేషణలు మీడియాలో వెలువడుతున్నాయి.







