Mahaa Daily Exclusive

  హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ గుడ్‌న్యూస్..!

Share

  • టోల్ ఛార్జీలు వసూలు చేయమన్న ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి
  • భారత నౌకలకు సురక్షితమైన మార్గాన్ని కల్పిస్తామని హామీ
  • భారత్ తో మా సంబంధాలు బాగున్నాయని వెల్లడి

 

టెహ్రాన్, మహా : పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం పలు దేశాలపై అధికంగా ఉంది. ముఖ్యంగా కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భారత్‌కు శుభవార్త అందింది. హర్మూజ్ నుంచి ప్రయాణించే భారత నౌకల నుంచి ఎటువంటి టోల్ వసూలు చేయడం లేదని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో కూడా భారత నౌకలకు సురక్షితమైన మార్గాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది. కొన్ని దేశాలకు హర్మూజ్ లో రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. తమ అనుమతి లేకుండా వస్తే పేల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ నౌకాశ్రయాలు, హర్మూజ్ జలమార్గంపై అమెరికా పూర్తిగా దిగ్బంధనం చేసినట్లు ప్రకటించిన సమయంలో ఇరాన్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. కాల్పుల విరమణ తర్వాత కూడా ఇరాన్, ఒమన్ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాయని వార్తలు వచ్చాయి. భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ రాయబార కార్యాలయంలో మాట్లాడుతూ.. ‘మేం ఇప్పటివరకు ఏదైనా మొత్తం వసూలు చేశామో లేదో మీరు భారత ప్రభుత్వాన్ని అడగవచ్చు. ఈ కష్ట కాలంలో మా సంబంధాలు బాగున్నాయి. భారత్, ఇరాన్ పరస్పర ప్రయోజనాలను పంచుకోగలవని మాకు నమ్మకం ఉంది. భారత నౌకలను హర్మూజ్ నుంచి సురక్షితంగా వెళ్లనిస్తామని’ ఫతాలీ క్లారిటీ ఇచ్చారు.

 

భారత్ ఒక నమ్మకమైన భాగస్వామి..

 

భారత ప్రభుత్వంతో ఇరాన్ సంబంధాలు చాలా దృఢంగా, మరింత నమ్మకంతో ఉన్నాయి. పలు కీలక సమయాల్లో భారత్ తనను తాను ఒక తెలివైన, నమ్మకమైన భాగస్వామిగా నిరూపించుకుంది. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు నేటికీ మెరుగ్గా కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భవిష్యత్తులో కూడా భారత నౌకలను హర్మూజ్ నుంచి సురక్షితంగా వెళ్లనిస్తాం’ ఇరాన్ ప్రతినిధి ఫతాలీ స్పష్టం చేశారు. నౌకల రాకపోకల ప్రక్రియను వివరిస్తూ త్వరలోనే ఇరాన్ ఒక కొత్త వ్యవస్థను ప్రకటించి, అమలు చేస్తుందని తెలిపారు. హర్మూజ్‌లో చిక్కుకున్న భారత జెండా కలిగిన 15 నౌకలను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి మా నౌకలను వెనక్కి తీసుకురావడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ వెల్లడించారు. ప్రస్తుతం మొత్తం 15 భారత నౌకలు అక్కడ ఉన్నాయి. అవి త్వరలోనే దేశానికి సురక్షితంగా తీసుకొస్తామని పేర్కొన్నారు.

 

అమెరికా తీరుపై యూకే, ఆస్ట్రేలియా రియాక్షన్..

 

ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధిస్తున్న ఆంక్షలను పలు దేశాలు సమర్థించడం లేదు. కొన్ని రోజుల నుంచి హర్మూజ్ పై దాడి చేద్దామంటూ ట్రంప్ ఇచ్చిన పిలుపును ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆయన కాస్త వెనక్కి తగ్గారు. బ్రిటన్ దీనికి మద్దతు ఇవ్వబోమని బహిరంగంగా ప్రకటించడం తెలిసిందే. అమెరికా నుంచి తమకు దీనికి సంబంధించి ఎటువంటి సందేశం అందలేదని ఆస్ట్రేలియా సహా పలు దేశాలు చెబుతున్నాయి.